విభజన: కిరణ్ రెడ్డి తిరుగుబాటా, సర్దుబాటా? (పిక్చర్స్)
విశాఖపట్నం: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు స్వరం వినిపించారు. ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని ఆయన చెప్పారు. విశాఖపట్నం జిల్లా రంపచోడవరంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన శుక్రవారం తీవ్ర స్వరంతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఆపేవరకు పోరాడుతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పదవి పోయినా తాను లెక్క చేయనని ఆయన అన్నారు.
అయితే, ఇటీవల జివోఎం సమావేశానికి హాజరు కాకుండా పుకార్లకు అవకాశం ఇచ్చారు. జివోఎం ముందు హాజరవుతారా అంటే సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నారు. దీంతో కాంగ్రెసు అధిష్టానం పార్టీ అధిష్టానంపై పూర్తి స్థాయిలో ధిక్కారానికి సిద్ధపడుతున్నారనే భావన ఏర్పడింది. మరోసారి శుక్రవారం ఆయన ధిక్కార స్వరం చూస్తే అధిష్టానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లే అనిపిస్తోంది.
కానీ, ఆయన ఓ మెలిక పెట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటించే వరకు పోరాటం చేస్తానని అంటూనే ఈ నెల 18వ తేదీన తాను జివోఎం ముందు హాజరవుతానని చెప్పారు. అక్కడ కూడా తాను సమైక్య గళం వినిపిస్తానని చెప్పారు. అయితే, రాష్ట్ర విభజనను ఆయన ఏ విధంగా అడ్డుకుంటారనే స్పష్టత మాత్రం రావడం లేదు. పరిస్థితి చూస్తుంటే ఆయన తిరుగుబాటు కన్నా సర్దుబాటుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. కరుడు గట్టిన సమైక్యవాదిగా పేరు సంపాదించుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ప్రత్యర్థుల నుంచి విమర్శలు పస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం రచ్చబండ కార్యక్రమంలోనూ ఆయన సమైక్యగళం వినిపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై, వైయస్సార్ కాంగ్రెసుపై ఆయన విమర్శలు చేశారు. సమైక్యం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. విభజన జరిగితే తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగతుందని చెప్పారు.
చేతులెత్తి నమస్కరించి..
విశాఖపట్నం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన చేతులెత్తి నమస్కరించి, ప్రజల ముందు సమైక్యగళం వినిపించారు. విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలు నమ్మారా..
తాను రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి దాకా పోరాటం చేస్తానని, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటతించే వరకు పోరాటం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు నమ్మారో లేదో తెలియదు.
తానేమీ దాచుకోవడం లేదు..
తాను లోపల ఓ మాట, బయట ఓ మాట మాట్లాడడం లేదని, రాష్ట్ర విభజనను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.
విభేదాల మధ్య సమైక్య గళం
జిల్లాకు చెందిన మంత్రి బాలరాజు రచ్చబండ కార్యక్రమానికి హాజరు కాలేదు. మరో మంత్రి గంటా శ్రీనివాస రావు రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి బాలరాజును ఆహ్వానించలేదని తెలుస్తోంది. దీంతో ఇరువురు మంత్రుల మధ్య సమైక్యవాదంలో విబేదాలు పొడసూపాయి.
చంద్రబాబుపై విమర్శలు..
ప్రజలు హాజరైన రచ్చబండ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు విభజనపై స్పష్టంగా చెప్పలేకపోతోందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకప్పుడు సమన్యాయమని చెప్పి ఇప్పుడు సమైక్యమంటోందని, వీరి తప్పుల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి అన్నారు.
కేంద్రంతో పోటీ పడుతున్నా..
విభజన విషయంలో తాను కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడుతున్నానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే, సమైక్యంగా ఉంచడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.