ఫైలిన్ కాలేదు, విభజన తుఫానును ఆపుతాం: సిఎం
శ్రీకాకుళం: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి ఆదివారం సంచలన వ్యాఖ్య చేశారు. ఫైలిన్ తుఫానును ఆపలేకపోయామని, విభజన తుఫానును ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధితులను పరామర్శించి ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి సమైక్య నినాదం చేశాడు. ఈ సయమంలో ముఖ్యమంత్రి అలా అన్నారు.
"ఇది దానికి సమయం కాదు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా. ఫైలిన్ సైక్లోన్ను ఆపలేకపోయాం. కానీ ఈ సైక్లోన్ను ఆపే ప్రయత్నం కచ్చితంగా చేస్తాం. అందుకు మీ సహాయ సహకారాలు ఉండాలి" అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతకు ముందు ఆయన తుఫాను తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఆ తర్వాత తుఫాను బాధితులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తుఫాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత తుఫాన్ వల్ల సంభవించిన నష్టం ఎంతో చెప్తామని ఆయన అన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, వారు విజ్ఞప్తులు పెట్టుకోవడానికి గడువు పెంచుతున్నామని ఆయన చెప్పారు.
తుఫాను వల్ల నష్టపోయిన మత్స్యకారులకు కోటి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. వరికి ఎకరాకు పదివేల రూపాయన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తుఫాను బాధితులకు నష్టపహారం పెంచుతామని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.