కిరణ్ రెడ్డి కాంగ్రెస్లోకే వస్తారు: సాయి ప్రతాప్
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరుతారనే ప్రచారంపై కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ స్పందించారు. బిజెపిలో చేరుతారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. కిరణ్ కుమార్ రెడ్ిడ తిరిగి కాంగ్రెసులోకి వస్తారనే నమ్మకం ఉందని ఆయన గురువారం మీడియాతో అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలోకి వెళ్లబోరనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయునిపల్లెకు వచ్చిన సందర్భంగా సాయిప్రతాప్ రాజకీయాలు మాట్లాడనంటూనే మీడియాతో కొద్ది సేపు ముచ్చటించారు.
ఎన్నికలకు ముందు పార్టీని వీడి వెళ్లిన నేతలంతా పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారనే విషయం వెలుగులోకి వస్తోందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెసులోకి రావాల్సిందేనని సాయిప్రతాప్ అన్నారు. ఇదే విషయాన్ని తాను ఎన్నికల ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే కొంత కాలం మౌనంగా ఉండడమే మంచిదని ఆయన అన్నారు. రాకీయాలు వాతావరణ పరిస్థితుల్లో మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. వర్షాలు కురుస్తాయని విత్తనాలు నాటబోతే వర్షం కురవదని, వర్షం లేదని సాగుకు దూరంగా ఉంటే వర్షం కురుస్తుందని, ఇప్పటి రాజకీయాలు అలాగే ఉన్నాయని ఆయన అన్నారు. పార్టీ వీడి వెళ్లనవాళ్లంతా తిరిగి వస్తే భవిష్యత్తు కాంగ్రెసు పార్టీదేనని ఆయన అన్నారు.