టి షాక్: శ్రీధర్ బాబుపై కిరణ్ బౌన్సర్, శైలజాకు బాధ్యత
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబుపై కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి... ఆయనను శాసన సభా వ్యవహారాల శాఖ నుండి తప్పించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ మంగళవార రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖను మంత్రి శైలజానాథ్కు అప్పగించారు. ఇంతకాలం కిరణ్ వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు అప్పగించారు. కొత్తగా ఏఱ్పాటు చేసిన భాష, సాంస్కృతిక శాఖను వట్టి వసంత్ కుమార్కు కేటాయించారు.
శాఖ మార్పు ద్వారా తెలంగాణ అంశంపై కిరణ్ బౌన్సర్ వదిలారు. కొత్త ఏడాది ముందు మంత్రి శ్రీధర్ బాబుకు ఝలక్ ఇచ్చారు. 3వ తేదీ నుంచి విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనున్న అత్యంత కీలకమైన సమయంలో శ్రీధర్ బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుండి తప్పించడం గమనార్హం. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ సిఫారసును గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి పంపించారు. ఆ సిఫారసును గవర్నర్ కూడా వెంటనే ఆమోదించారు.
శ్రీధర్ బాబు శాఖ మార్చడం ఒక సంచలనం కాగా, శాసనసభ వ్యవహారాల శాఖను సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్గా, సమైక్య పోరుకు నేతృత్వం వహిస్తున్న శైలజానాథ్కు శాసనసభా వ్యవహారాలను అప్పగించడం విశేషం. ప్రొరోగ్ వివాదం, విభజన బిల్లుపై చర్చకు శ్రీకారం ఈ రెండు వివాదాల్లో తనను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారన్న కోపంతోనే శ్రీధర్ బాబుకు కిరణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకు!?
అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందు సభ ప్రొరోగ్ కాలేదు. బిల్లు రాష్ట్ర శాసనసభకు రానున్న నేపథ్యంలో సభను ప్రొరోగ్ చేయించాలని, తర్వాత సభను ఎప్పుడు సమావేశ పరచాలనే నిర్ణయాధికారాన్ని తన చేతిలోకి తీసుకోవాలని సిఎం భావించారు. ప్రొరోగ్ చేయాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్కు లేఖ రాశారు. ఇది తెలంగాణ నేతలకు కోపం తెప్పించింది. 'ప్రొరోగ్కు ఒప్పుకునేది లేదు. ఒకవేళ స్పీకర్ లేఖ పంపించినా శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆ ఫైలును నా దగ్గరే పెండింగ్లో పెడతాను' అని శ్రీధర్ బాబు బహిరంగంగా ప్రకటించారు.
అంతేకాదు స్పీకర్ నుంచి వచ్చిన ఫైలును పెండింగ్లో పెట్టి చూపించారు కూడా. దీంతో సభ ప్రొరోగ్ కాకుండా ఆగిపోయింది. కిరణ్ వ్యూహానికి గండి కొట్టినట్లయింది. చివరికి మంత్రివర్గం సమావేశమై శాసనసభ శీతాకాల సమావేశాలకు ముహూర్తం నిర్ణయించింది. ఇలా ప్రొరోగ్ విషయంలో శ్రీధర్ ముఖ్యమంత్రితో ఢీ అంటే ఢీ అన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి సభకు ముసాయిదా బిల్లు వచ్చింది. డిసెంబర్ 16న స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అదే రోజు సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టు విక్రమార్క స్పీకర్ స్థానంలో ఉండగా బిల్లుపై చర్చకు శ్రీకారం చుట్టడంపై చిన్నపాటి డ్రామా నడిచింది.
శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్ బిల్లుపై చర్చ చేపట్టాలని కోరడం ఆ వెంటనే స్పీకర్ స్థానంలో ఉన్న విక్రమార్క విపక్షనేత చంద్రబాబు పేరు పిలవడం, ఆ వెంటనే సభను వాయిదా వేయడం జరిగిపోయింది. దీంతో బిల్లుపై చర్చ మొదలైందా? లేదా? అనే మీమాంస, వివాదం తీవ్రస్థాయిలోనే చెలరేగింది. సాంకేతికంగా చర్చ ప్రారంభమైనట్లుకాదని ఒక వర్గం చెబుతుండగానే శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్ చర్చ మొదలైందని ప్రకటించారు. ప్రొరోగ్ వ్యవహారంతో శ్రీధర్ బాబుపై కోపంగా ఉన్న కిరణ్కు చర్చ వివాదం మరింత కోపం తెప్పించింది.
మూడో తేదీ నుంచి విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇలాంటి సమయంలో శాసనసభ వ్యవహారాల శాఖ శ్రీధర్ వద్ద ఉంటే తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన శాఖను మార్చినట్లు తెలుస్తోంది. శ్రీధర్కు ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖల్లో ఒకటైన వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు.