'అది కిరణ్ అసలు రంగు': శ్రీధర్కు షాక్పై కెసిఆర్ లైట్
హైదరాబాద్: శాసన సభ వ్యవహారాల శాఖ నుండి మంత్రి శ్రీధర్ బాబును తప్పించడంపై తెలంగాణ ప్రాంత నేతలు మండిపడుతున్నారు. కిరణ్ తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదని విమర్శిస్తున్నారు. తనను సభా వ్యవహారాల శాఖ నుండి ఎందుకు తప్పించారో తెలియదని శ్రీధర్ బాబు చెప్పారు. తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తి లేదన్నారు.
కిరణ్ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్దమని పిసిసి మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ అన్నారు. ఆయన అసలు రంగు అదని, ఇప్పుడు బయటపడిందని, తెలంగాణ సభ్యులు దీనిని ప్రతిఘటిస్తారన్నారు. కిరణ్ ఎన్ని ఎత్తులు వేసినా విభజన ప్రక్రియ ఆగే సమస్య లేదని, ఆయన అనుకున్న దాని కంటే నాలుగు రోజుల ముందే తెలంగాణ సాకారమవుతుందన్నారు. కిరణ్ చర్య అహంకారానికి నిదర్శనమని, అధిష్టానం దీనిపై ఆలోచన చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు.
విభజనకు ముందు ఇలాంటివి మామూలేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరు ఆవేశానికి లోనుకాకూడదని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తుది దశలో ఇటువంటి అపోహలు, దుష్ప్రచారాలు, వింతలు, విశేషాలు జరగడం సాధారణమే అన్నారు. కిరణ్ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చారని తెరాస నేత వినోద్ కుమార్ దుయ్యబట్టారు.
కిరణ్ మతిభ్రమించిన వారిలా వ్యవహరిస్తున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. కిరణ్ తీరు విభజన బిల్లుకు అనుకూలంగా ఉన్న వారిని అవమానించే విధంగా ఉందని, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించే వ్యక్తి ఆ పార్టీ అప్పగించిన పదవిలో మాత్రం ఎందుకు ఉంటున్నారో చెప్పాలన్నారు.