పాతగూటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు: రాజ్నాథ్తో భేటీ
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు సోమవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలిశారు. కృష్ణం రాజు బిజెపిలో తిరిగి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజ్నాథ్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరేందుకే ఆయన కలిసినట్లుగా తెలుస్తోంది.
కృష్ణం రాజు రెండున్నర నెలల క్రితం హైదరాబాదుకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఇప్పుడు రాజ్నాథ్ను కలిశారు. కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు తిరిగి పాతగూటికి దగ్గరవుతున్నారు.
మోడీ హైదరాబాదుకు వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికిన వారిలో కృష్ణం రాజు కూడా ఉన్నారు. గతంలో ఆయన బిజెపిలో పని చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి హయాంలో పని చేశారు. 2004 తర్వాత కూడా ఆయన బిజెపిలో కొనసాగారు. ఆ తర్వాత క్రమంగా బిజెపికి దూరమయ్యారు.
2008లో ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో అందులో చేరారు. 2009 సాధారణ ఎన్నికలలో రాజమండ్రి నుండి చిరంజీవి పార్టీ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్, కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో ఇద్దరు నటులు ఓడిపోయి, ఉండవల్లి గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో కృష్ణం రాజు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. కృష్ణం రాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరవచ్చుననే ప్రచారం సాగింది. అయితే రెబల్ స్టార్ మాత్రం బిజెపికి వైపు అడుగులు వేస్తున్నారు. బిజెపి తరఫున ఆయన రాజమండ్రి లేదా నరసాపురం నుండే మళ్లీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.