రేపే పట్టాలెక్కనున్న అనంత-ఢిల్లీ కిసాన్ రైలు... రైల్ వెబ్ ద్వారా ప్రారంభించనున్న సీఎం జగన్
అనంతపురం-ఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే కిసాన్ రైలు బుధవారం(సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10.30గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైల్ వెబ్ ద్వారా ఈ రైలును ప్రారంభిస్తారు. రైతు దిగుబడులకు మార్కెటింగ్ ఊతమిచ్చే ఉద్దేశంతో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
కిసాన్ రైలుపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ...రైతు కష్టపడి పండించిన వివిధ రకాల నాణ్యమైన ఉత్పత్తులకు కిసాన్ రైలుతో గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. నాణ్యమైన దిగుబడులకు అధిక ఆదాయం తీసుకొచ్చేందుకు అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలును నడుపుతున్నట్లు చెప్పారు.
అనంతపురం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్,మధ్యప్రాచ్య దేశాలకు కూడా పండ్లు ఎగుమతి అవుతున్నాయన్నారు. అనంతపురం ఫ్రూట్స్కి ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో మంచి పేరు ఉందన్నారు. కాకినాడ అనగానే ఖాజా,ఉప్పాడ అనగానే పట్టుచీరలు ఎలాగైతే గుర్తొస్తాయో భవిష్యత్తులో అనంతపురం అనగానే పండ్లు గుర్తొచ్చే పరిస్థితి వస్తుందన్నారు.
అనంత నుంచి హస్తినకు వెళ్తున్న తొలి కిసాన్ రైల్లో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్ కోచ్ బోగీ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ తలారి రంగయ్య,ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
కిసాన్ రైలు అందుబాటులోకి రావడం ద్వారా రైతుల పంటలకు సరైన రవాణా సదుపాయం దొరకనుంది. తద్వారా ప్రయాణ సమయంతో పాటు ఖర్చు ఆదా కానుంది. అలాగే అక్కడినుంచి ఎగుమతి చేసే పంటలు సకాలంలో గమ్య స్థానాన్ని చేరుకోవడం ద్వారా పాడవకుండా ఉంటాయి.
అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు#Anantapuram #Delhi #kisanrail pic.twitter.com/myQrVCEmY4
— oneindiatelugu (@oneindiatelugu) September 8, 2020