కిషన్ రెడ్డి తో వల్లభనేని వంశీ భేటీ ...టీడీపీ కి షాక్ ఇస్తారని ప్రచారం
ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీకి సొంత పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. పార్టీ మారి చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నారు . అసలే ఇబ్బందుల్లో ఉంటే మరోపక్క పార్టీలో ఉన్న నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డితో గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ టిడిపి వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీ భేటీ .. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
కిషన్ రెడ్డి, వల్లభనేని వంశీ, మాణిక్యాలరావులు భేటీ అయ్యారు. వీరు భేటీ అయిన ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది . 18 మంది టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారిని త్వరలోనే పార్టీలో చేర్చుకుంటామని బిజెపి నేతలు ఇప్పటికే ప్రకటించారు . దీంతో కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీ సమావేశం టిడిపి వర్గాలలో భయాందోళనలకు కారణమైంది.బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడితే చాలు బీజేపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీలోకి వెళ్ళాలంటే పదవులకు రాజీనామా చెయ్యాలనే నిబంధన పెట్టటంతో అందరి చూపు దేశ రాజకీయాల్లో అధికార పార్టీగా ఉన్న బీజేపీ వైపు మళ్ళింది . దీంతో ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి.ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్రం హోశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు. గంటకు పైగా కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు వల్లభనేని వంశీమోహన్. కిషన్ రెడ్డితో వంశీమోహన్ భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కృష్ణా జిల్లాలోని స్వర్ణ భారతి ట్రస్ట్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి , వల్లభనేని వంశీలు
ఇప్పటికే చాలా వరకు టీడీపీ ఖాళీ చేసే పనిలో ఉంది బీజేపీ . అయితే, కృష్ణా జిల్లాలోని స్వర్ణ భారతి ట్రస్ట్లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డిని ముఖ్య అతిథిగా, వంశీని అతిథులలో ఒకరిగా ఆహ్వానించారు . ఈ సమావేశం వెనుక రాజకీయ ఎజెండా లేదని వల్లభనేని వంశీ మద్దతుదారులు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో కిషన్ రెడ్డితో కేవలం మర్యాదపూర్వక సమావేశం అని అంటున్నారు . కేంద్ర హోంమంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం కల్పించినందుకు వంశీ అభినందించినట్లు చెప్పారు.
భారీ ఫిరాయింపులు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్న నేపధ్యంలో కిషన్ రెడ్డితో వల్లభనేని భేటీ హాట్ టాపిక్
ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకుని రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంగతి మరువకముందే మరోమారు టీడీపీ నేతలను టార్గెట్ చేసి మరీ బీజేపీ రాజకీయం జరుగుతుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గం నేతల భేటీలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. వరుసగా భేటీలు కావడం, చంద్రబాబు దగ్గర అల్టిమేటం జారీ చేయడం వంటి పరిణామాలు రాజకీయపరంగా ఆసక్తికరంగా మారుతున్నాయి.ఇలాంటి తరుణంలో కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీమోహన్ భేటీ కావడం రాజకీయ దుమారానికి కారణం అవుతుంది . దీంతో వల్లభనేని వంశీమోహన్ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జోరుగానే జరుగుతుంది.