కిషన్, తలసాని, జయసుధ.. నగరంలో దిగ్గజాల ఎదురీత
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఆయా పార్టీల ముఖ్య నేతలు ఈసారి గెలుపు కోసం ఎదురీదుతున్నారట. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ప్రముఖ నటి జయసుధ, సీనియర్ కాంగ్రెసు నేత మర్రి శశిధర్ రెడ్డి, టిడిపి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, పిజెఆర్ తనయుడు విష్ణు, కూతురు విజయా రెడ్డి తదితరులు పలు పార్టీల నుండి బరిలో ఉన్నారు.
అంతకుముందు హిమయత్ నగర్ నియోజకవర్గం నుండి గెలుపొందిన కిషన్ రెడ్డి నియోజకవర్గ పునర్విభజన కావడంతో 2009లో అంబర్ పేట నుండి పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. తెలంగాణ క్రెడిట్ బిజెపికి కలిసి వచ్చే అవకాశం ఉండటంతో పాటు.. ప్రజలకు చేరువగా ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ నుండి సీనియర్ నేత వి హనుమంత రావు, తెరాస నుండి బలమైన ఎడ్ల సుధాకర్ రెడ్డి ప్రత్యర్థులుగా ఉండటంతో కిషన్ రెడ్డికి ఎదురీత తప్పదంటున్నారు.
సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, తెరాస నుంచి తూం భీంసేన్లు బరిలో ఉండగా, గతంలో ఎన్నడూ లేని విధంగా మజ్లిస్ కూడా ఈసారి నార్ల మోహన్రావును రంగంలో దింపింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రధాన పోటీ కాంగ్రెస్, బిజెపిల మధ్యనే ఉండగా, ఇపుడు చతుర్మఖ పోటీ నెలకొంది. 2004లో దిగ్గజమైన దత్తాత్రేయను ఢీకొనేందుకు కాంగ్రెసు నేతలు ఎవరు ముందుకు రాలేదంటారు. ఆ సమయంలో అంజన్ పోటీ చేసి గెలిచారు.
2009లోను విజయం సాధించారు. దీంతో ఈసారి గెలుపుపై ఆయన ధీమాతో ఉన్నారు. బండారు దత్తాత్రేయ ప్రతీకారం కోసం చూస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో గెలిచిన సికిందరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోని ఓ డివిజన్ గత ఎన్నికల సమయంలో చేపట్టిన పునర్విభజనలో సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిందని, ఆయన సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు.
కానీ సనత్నగర్పై మంచి పట్టు, మైనార్టీ ఓటర్లలో ఆదరణ కల్గిన కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్ రెడ్డితోనే ప్రధాన పోటీ ఉంటుందని తలసాని భావిస్తున్నా, తలసాని ప్రత్యర్థి కావటంతో శశిధర్ రెడ్డి ఎదురీదక తప్పదంటున్నారు. సికింద్రాబాదు అసెంబ్లీకి జయసుధ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె పైన టిడిపి, తెరాసలు గట్టిగా పోటీ ఇచ్చే అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే, తాము చేసిన అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండటమే తమను గెలిపిస్తుందని సిట్టింగులు చెబుతుండగా.. సిట్టింగుల చేసిన అభివృద్ధి ఏం లేదని అదే తమను గెలిపిస్తుందని ప్రత్యర్థులు అంటున్నారు.