కిషన్ అలక: సికింద్రాబాద్పై పట్టు, బుజ్జగింపుతో తగ్గారు
హైదరాబాద్: సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆ స్థానం తనకు దక్కకపోవడంతో అలిగినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆయనకు అంబర్పేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. ఆ స్థానం నుంచి పోటీకి ఆయన ససేమిరా అని భీష్మించుకున్నారట.
కిషన్ రెడ్డికి మద్దతుగా ఆరెస్సెస్ కూడా నిలిచింది. సికింద్రాబాద్ లోకసభ స్థానం కిషన్ రెడ్డికే దక్కుతుందని అందరూ భావించారు. కానీ మంగళవారం రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ స్థానానికి దత్తాత్రేయ పేరును ప్రకటించడంతో కిషన్ రెడ్డి మనస్థాపం చెందారంటున్నారు.
దీంతో బుధవారం ఉదయం ఆయన బి ఫారం తీసుకోవడానికి నిరాకరించారు. అంబర్పేట నుంచి కాకపోతే గోషామహల్ నుంచైనా బరిలోకి దిగాలని అగ్రనాయకులు కిషన్ రెడ్డికి సూచించారు. ఎట్టకేలకు పార్టీ ముఖ్యనేతలు బుజ్జగించడంతో చివరకు మధ్యాహ్నం 1.30 గంటలకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వచ్చి అంబర్పేట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, ఇటీవల తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై పార్టీ అధిష్టానంతో కిషన్ రెడ్డి విభేదించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఆయన ససేమీరా అన్నారు. కానీ అధిష్టానం రెండు ప్రాంతాల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకుంది.