చంపినందుకా యాత్ర: కిషన్, సైనికుడికి సెల్యూట్!(ఫోటో)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు జైత్రయాత్రలు ఎందు చేస్తున్నారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను తొమ్మిదేళ్లు వంచించి, మరణాలకు కారణమైనందుకు జైత్రయాత్రలు చేస్తున్నారా అని ధ్వజమెత్తారు. ఇప్పుడు జైత్రయాత్ర చేస్తున్న మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్లో తెలంగాణవాదులపై కేసులు పెట్టించి లాఠీచార్జి చేయించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, కేంద్ర, రాష్ట్ర సీమాంధ్ర మంత్రులు వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇవన్నీ మరిచిపోయి ఏ మొహం పెట్టుకుని జైత్రయాత్రలు చేస్తారు? మీ జైత్రయాత్రలు తెలంగాణ ప్రజలపైనా? ఉద్యమకారులపైనా? ఐకాసపైనా? లేకపోతే ఆత్మ బలిదానాలు చేసుకున్న 1,100 మంది కుటుంబాలపైనా?'' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్ కుట్రలు, మోసాలను తెలంగాణ ప్రజలు క్షమించరని, ఆ పార్టీని బలిదానం చేయక తప్పదని హెచ్చరించారు. జైత్రయాత్రలు ఆపి ముందు సీమాంధ్ర ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని, సాగునీరు, ఉద్యోగాలు, హైదరాబాద్పై వారి సందేహాలను తొలగించాలని, కావాలంటే మీ ప్రధాన మంత్రితో సభ పెట్టి సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు.
తమ పార్టీ నేత వెంకయ్యనాయుడిపై ఆరోపణలు వాస్తవం కాదని, ఆయన ఎప్పుడూ రాష్ట్ర విభజనకు అనుకూలమేనని చెప్పారు. టిడిపితో పొత్తు విషయమై ప్రశ్నించగా.. కొన్ని పార్టీలు తమ భుజాలపై తుపాకీ పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని, కానీ, తాము ఎవరితోనూ పొత్తులపై చర్చించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు కూడా రాదంటూ వెలువడిన సర్వే గురించి ప్రస్తావించగా.. తాము ఆ సర్వేలను పట్టించుకోబోమన్నారు.
కాగా, ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన చిత్తూరు జిల్లా సైనికుడు వినాయకన్ కుటుంబానికి కిషన్ రెడ్డి ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు.