చంచల్గూడలో జగన్ ఖాళీ చేసిన బ్యారక్కు కిరణ్: కిషన్
మాజీ డిజిపి దినేష్ రెడ్డి ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కిరణ్ ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది దినేష్ రెడ్డి ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
సీమాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ విభజనకు వ్యతిరేకంగా కిరణ్ కుట్ర చేస్తున్నారని, పోలీసు వ్యవస్థనూ దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిఎం సోదరుడు సంతోష్ రెడ్డిపై గతంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు మాజీ డిజిపినే స్వయంగా చెబుతున్నాడన్నారు. సమ్మెల కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఉద్యమకారులను పిలిపించి అనుమానాలు నివృత్తి చేయాల్సిన సిఎం ఇంకా రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చేసిన కుట్రలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వేరుగా అన్నారు. దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం కుట్రలను నిర్ధారిస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు, ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు కిరణ్ కుట్రలు చేస్తున్నారని తాము చేసిన ఆరోపణలకు మాజీ డిజిపి వ్యాఖ్యలే సాక్ష్యమని ఆయన అన్నారు.