మీ సంగతేంటి: కిషన్, ఆరెస్సెస్తో కెసిఆర్ చర్చ: సుధీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రరావు పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం నిప్పులు చెరిగారు. తెరాస ఉద్యమ పార్టీ కాదని, అది ఒక సగటు రాజకీయ పార్టీ కిషన్ అన్నరాు. శనివారం బిజెపి కార్యాలయంలో మాట్లాడారు. తెరాస, కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న తిట్ల దండకంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటరీ వ్యవస్థలో సభ్యమైన భాషను వాడాలన్నారు.
కానీ పొన్నాల, కెసిఆర్.. ఒకరిపై ఒకరు బూతుల దండకాన్ని అందుకుంటున్నారని, దానిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తల నరుక్కుంటామంటూ, సన్నాసులు, దద్దమ్మలు వంటి పదజాలాన్ని వాడుతున్నారని చెప్పారు. తెలంగాణ స్వప్నం సాకారమైనందున అభివృద్ధే ప్రధాన ఎజెండాగా మాట్లాడాలి గాని తిట్లు, శాపనార్థాలతో ప్రజల మనసులు దోచుకోలేరన్నారు. ఎవరు ఏ పార్టీ నేతలను బాగా తిట్టారన్న దానిగురించి ఆలోచించే స్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు.
బిజెపి, టిడిపిది అనైతిక పొత్తు అంటూ కెసిఆర్ విమర్శిస్తున్నారని, అసలు తెరాస గతంలో పెట్టుకున్న పొత్తుల సంగతేమిటో చెప్పాలన్నారు. అలాంటి పార్టీలకు బిజెపి, టిడిపిల పొత్తు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైనందున, దేశ విశాల ప్రయోజనాల దృష్టా తమ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుందన్నారు. ఉద్యమం పూర్తయిందని, తెలంగాణ వచ్చేసిందని, అందుకే తాము పొత్తు పెట్టుకున్నామన్నారు.
కానీ ఉద్యమం ఉధృత దశలో ఉన్న సందర్భంలో తెరాస పొత్తు ఎందుకు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన, ఉద్యమకారులపై కేసులు పెట్టించిన మంత్రులను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఉద్యమ సందర్భంలో టిజెఏసి భాగస్వామ్య పక్షమైనందున తాము ఓపిక పట్టామని, ఇప్పుడు ఉద్యమం ముగిసిందని.. ఓపిక పట్టేది లేదన్నారు.
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా సాధిస్తామంటూ పొన్నాల చెబుతున్నారని, ఇప్పటివరకు జాతీయ హోదాను ఎందుకు సాధించలేదో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెసుకు మూడో స్థానమే అన్నారు. జైరాం రమేష్ నోట్లో ఉన్నది నాలుకో కాదో అర్థం కావడం లేదన్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెబుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఇస్తామంటే బిజెపి అడ్డుకుందని చెబుతున్నారని, అసలు బిజెపి భుజాలపై తుపాకి పెట్టి అడ్డుకోవాలని ప్రయత్నించింది కాంగ్రెస్ కాదా? అన్నారు.
మోడీ వస్తే మత విద్వేషాలు రగులుతాయంటూ జైరాం చెబుతున్నారని, బిజెపి అధికారంలో ఉంటేనే... పాతబస్తీలో మతకల్లోలాలు ఎలా చెలరేగాయా అని ప్రశ్నించారు. ముజఫర్నగర్ మతకల్లోలాలు, ఇందిర హత్య తర్వాత చోటు చేసుకున్న అల్లర్లకు ఎవరు బాధ్యులన్నారు. అందుకే దేశంలో మోడీ ప్రధాని అయితేనే ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు.
పొత్తుకు ఎందు ప్రయత్నించావు: శేషగిరి రావు
బిజెపి మతతత్వ పార్టీయే అయితే కెసిఆర్ పొత్తు కోసం ఎందుకు ప్రయత్నించారని బిజెపి నేత ఎస్వీ శేషగిరి రావు వేరుగా ప్రశ్నించారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో బిజెపితో పొత్తు కోసం ఆరెస్సెస్ నేతలతో ఎందుకు చర్చలు జరిపారో చెప్పాలని సుధీష్ రాంభోట్ల ప్రశ్నించారు.