కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి..? నూతన ఉత్సాహంలో తెలంగాణ బీజేపి..!!
హైదరాబాద్: డిశెంబర్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు కోల్పోయిన తెలంగాణ బీజేపి నాలుగు లోక్ సభ అభ్యర్థులను గెలుపించుకుని ఆ లోటును భర్తీ చేసుకుంది. అంతే కాకుండా తెలంగాణ లో పార్టీ పుంజుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఐతే లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టనుండటంతో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
లోక్సభలో రాష్ట్రం నుంచి నలుగురు భాజపా ఎంపీలు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిలో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి గెలిచిన సోయం బాపురావు ఉన్నారు. ఈ నలుగురిలో కిషన్రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు లభించడం ఖాయమన్న అభిప్రాయాలు కమలదళంలో వినిపిస్తున్నాయి.
కరీం నగర్ లో వికసించిన కమలం .. వినోద్ కుమార్ పై బండి సంజయ్ ఘన విజయం
2014 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒక్క లోక్సభ స్థానంలోనే విజయం సాధించింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన దత్తాత్రేయకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించారు. కొంతకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన తర్వాత దత్తాత్రేయను తొలగించారు. దీంతో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు బీజేపి ఎంపీలు గెలుపొందడంతో.. కేంద్ర కేబినెట్లో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ నలుగురూ ఎంపీలుగా ఎన్నికవడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా తొలిసారి. వీరిలో కిషన్రెడ్డి రాష్ట్ర పార్టీలో సీనియర్ నేత. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో కేంద్రమంత్రిగా ఆయనకే అవకాశాలెక్కువ ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.