ఎవరున్నా అంతే: అన్నయ్యపై పోటీకి సై, కిరణ్ రెడ్డి అనుచరుల ఆగ్రహం! ఇదీ లెక్క
చిత్తూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఆసక్తికర పోరు కనిపించే అవకాశం ఉంది. పీలేరులో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడి నుంచి తన అన్నయ్య, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన పోటీకి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి సై అంటున్నారు.
ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో, కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కిరణ్ సూచనలతోనే కిషోర్ టీడీపీలో చేరారనే వాదనలు ఉన్నాయి. అప్పటికి కిరణ్ రాజకీయంగా ఏ పార్టీలో లేరు. ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు సోదరులు చెరో పార్టీలో ఉన్నారు. దీంతో పీలేరు రాజకీయం రసవత్తరంగా మారింది.
పీలేరు నుంచి పోటీ, అన్నయ్యపైనా సై
టీడీపీ తరఫున పీలేరు టిక్కెట్ తనకే దక్కుతుందని కిషోర్ కుమార్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అన్నయ్య కిరణ్ రెడ్డిపై పోటీ చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని ఆయన అంటున్నారట.
పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పైన తాను 2019లో పోటీ చేయబోతున్నట్లు మీడియాకు తెలిపారు.
కిరణ్ అనుచరుల ఆగ్రహం
ఒకవేళ మీ సోదరుడు కిరణ్ రెడ్డి పీలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ పైన పోటీచేస్తే మీరు తప్పుకుంటారా? అని ప్రశ్నిస్తే.. ఎవరు పోటీలో ఉన్నా తాను మాత్రం వెనక్కు తగ్గేది లేదని చెప్పారట. దీంతో కిశోర్ వ్యాఖ్యలపై కిరణ్ అనుచరులు మండిపడుతున్నారని అంటున్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండగా కిశోర్ చిత్తూరులో చక్రం తిప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అన్నిరకాలుగా అండగా నిలబడిన అన్నకు కిశోర్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారట.
అన్నదమ్ముల సవాల్.. అంత లేకపోవచ్చు!
రాజకీయాల్లో వేర్వేరు పార్టీలలో ఉన్న అన్నదమ్ములు ఉన్నారు. అవగానతో ఉన్నవారు లేదా తీవ్రస్థాయి విమర్శలు గుప్పించుకునే వారు కూడా ఉన్నారు. నిన్నటి వరకు కిరణ్ రెడ్డి వెన్నంటే కిషోర్ ఉన్నారు. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నారు. దీంతో వారి మధ్య పోరు ఉంటుందా అనే ఆసక్తికర చర్చ వట్టిదే అనే వారు లేకపోలేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ అంటున్నారు. కాబట్టి కిషోర్ రెడ్డికి పోటీ అనే చర్చే లేదని అంటున్నారు. మాజీ సీఎంగా ఆయన జాతీయస్థాయిలో మాత్రమే ఉంటారని చెబుతున్నారు.
మరో కోణం.. టీడీపీ-కాంగ్రెస్ పొత్తు
మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇటీవల టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దగ్గరవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. దీనిని ఏ పార్టీకి ఆ పార్టీ కొట్టి పారేసినప్పటికీ.. వారి మాట తీరు, చేతలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అవగాహనతో ముందుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదనే వారు లేకపోలేదు. ఈ రకంగా చూస్తే వారిద్దరికి ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు.