చిరుకి బాధ్యత: సోనియాపై కెకె ఆగ్రహం, మాది తప్పేనని
వరంగల్/ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు రూపొందించే అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో అంతులేని జాప్యం చేసిందని ఆరోపించారు. ఈ జాప్యం వల్లే తెలంగాణ ప్రాంతంలో 1200 మంది బలిదానాలు చేయాల్సి వచ్చిందని అన్నారు.
తెలంగాణ ఇవ్వాలన్న తపన కాంగ్రెస్ నేతల్లో ఉండేది కాదన్నారు. తెలంగాణ విషయంలో తామెన్నడూ వెనుకంజ వేయలేదన్నారు. చరిత్ర తెలుసుకోకుండా సోనియా, రాహుల్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంతోమంది ఆత్మహత్యల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.
అమరవీరుల గురించి కాంగ్రెసు పార్టీ నేతలు మాట్లాడితే సిగ్గేస్తోందన్నారు. పార్లమెంటులో తెలంగాణను అడ్డుకున్న కేంద్రమంత్రికి సీమాంధ్ర కాంగ్రెసు ఎన్నికల బాధ్యతను అప్పగించిందని విమర్శించారు. చిరంజీవికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
తాము స్వయంపాలన కోరితే కాంగ్రెసు గవర్నర్ పాలన ఇచ్చిందని, సొంత రాజధాని కోరితే ఉమ్మడి రాజధాని ఇచ్చిందని దుయ్యబట్టారు. సిపిఐతో పొత్తు కుదరక పోవడం దురదృష్టకరమన్నారు. సిట్టింగ్ స్థానాల్లో సీట్లు కోరడం సరికాదన్నారు. సిపిఐ సిట్టింగ్ స్థానాల్లో తాము సీట్లు కోరడం తప్పేనన్నారు. కెసిఆర్ తన పార్టీని విలీనం చేస్తామంటేనే తెలంగాణ ఇచ్చామనడం... తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు.
కెసిఆర్పై జైరాం నిప్పులు
కెసిఆర్ పైన కేంద్రమంత్రి జైరాం రమేష్ ఖమ్మం జిల్లాలో నిప్పులు చెరిగారు. కెసిఆర్ హిట్లర్ను మించిన నియంత అన్నారు. తెలంగాణకు కావాల్సింది కుటుంబ పాలన కాదన్నారు. కెసిఆర్వి అనైతిక రాజకీయాలు అని విమర్శించారు. నమ్మక ద్రోహానికి కెసిఆర్ మారుపేరు అన్నారు. టిడిపి, బిజెపి పార్టీలకు పెద్దతేడా లేదన్నారు.