సిఎం పోస్ట్: కెకె ఆసక్తికర వ్యాఖ్యలు, ఎవరు కాదు: గద్దర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు మంగళవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాము దళిత ముఖ్యమంత్రి అంశాన్ని పక్కన పెట్టలేదని చెప్పారు. తెరాస అధికారంలోకి వస్తే కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి కోసం చూస్తున్నారన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు.
తాము దళిత సిఎం అంశాన్ని పక్కన పెట్టలేదన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణను నిలబెట్టే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్డీయేలో చేరకుంటే నిధులు ఇవ్వమని చెప్పడం విడ్డూరమన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎవరికి తెలుసునన్నారు. థర్డ్ ఫ్రంట్ కేవలం తమకు పొలిటికల్ ఆప్షన్ మాత్రమే అన్నారు.
ఇవ్వలేదు.. తేలేదు: గద్దర్
తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేదని, మరెవరు తేలేదని గద్దర్ వేరుగా అన్నారు. ప్రజలందరు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారని చెప్పారు. తెలంగాణ పునర్ నిర్మాణం అంటే ఓట్లను నిర్మించుకోవడం కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.
20 సీట్లే: కాకా
తెరాసకు 20కి మించి సీట్లు రావని కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి (కాకా) జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కాకా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కెసిఆర్ మాట తప్పారన్నారు. దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఇప్పుడు సిఎం సీటు కోసం కెసిఆర్ ఆరాటపడుతున్నారన్నారు. దీంతో తెరాస సీట్లు తగ్గుతాయన్నారు. కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు.