నాకన్నా సమర్థుడు, కెసిఆరే సిఎం: కెకె, సోనియాపై ఫైర్
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పేవన్నీ అబద్దాలేనని, తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కన్నా సమర్థుడని తెరాస సీనియర్ నేత కె కేశవ రావు సోమవారం అన్నారు. సోనియా మొసలి కన్నీరు కారుస్తున్నారని, కెసిఆర్పైనా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలు, అర్థసత్యాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టినపుడు కెసిఆర్ సభలో లేడని చెప్పడం.. ఈ శతాబ్దంలో ఎవరూ చెప్పని పెద్ద అబద్ధమన్నారు. కాంగ్రెస్లో చేరకపోతే వెన్నుపోటుదారులమవుతామా అని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో ఏ రోజైనా కాంగ్రెస్వాళ్లు భుజం భుజం కలిపి నడిచారా...? తెలంగాణలో ఆరువందలమంది మంది చనిపోతే స్పందించని సోనియా, రాంలీలా మైదానంలో ఒక యువకుడు చనిపోతే పార్లమెంట్లో సంతాప తీర్మానం చేశారా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వనని సొంత పార్టీ సిఎం చెప్పినప్పుడు.. తెలంగాణ బిల్లును వెనక్కి పంపినప్పుడు.. పార్లమెంట్లో ఎంపీలు విప్ను ధిక్కరించినపుడు.. ఏం చర్యలు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకే తాను బయటికి వచ్చానని, ఎంపీలు బయటకు వచ్చారనే తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.
చేశారు. తెలంగాణకు తాను వ్యతిరేకినని చెప్పిన దిగ్విజయ్, జైరాం రమేష్ ఓ బక్వాస్ అన్నారు. పోరాట పటిమ, ధైర్యం, రాజీలేని పోరాటం, విజన్తో నడుచుకునే వ్యక్తి కెసిఆర్.. తనకన్నా సమర్థుడని, తాను చెబుతున్న.. కెసిఆర్ లాంటి వ్యక్తే సిఎం కావాలన్నారు. తెలంగాణ క్రెడిట్ ప్రజలకే దక్కాలని, ఆ ప్రజలే కెసిఆర్ అని కేకే అన్నారు.