ఏపీకి ప్రత్యేక హోదాపై కేకే ఓకే కానీ, టీకీ: తెరాస ఎంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు స్వాగతించారు. అయితే, తెలంగాణ కూడా వెనుకబడి ఉన్నందున ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిపినట్లు తెలంగాణకు ఇవ్వలేదని కేకే ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలి: తెరాస డిమాండ్
తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు గురువారం డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే పక్షాలు పాలనలో ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు జరిపారని వారు ఆరోపించారు.
తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు వెనుకబడి ఉన్నాయని తెరాస ఎంపీలు గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటనలో 14 అంశాల పైన వినతి పత్రం ఇవ్వగా ఒక్క దాని పైన కూడా స్పందించలేదని వారు అన్నారు.
అవరోధాలను అధిగమించేలా: మోడీ
ప్రజలను భాగస్వాములను చేస్తూ.. వారిని శక్తిమంతులుగా తయారు చేసే బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా బడ్జెట్ ఉందని కొనియాడారు. దశాబ్దకాలంగా ఉన్న అవరోధాలను అధిగమించేలా రూపకల్పన జరిగిందన్నారు.