లోకేష్ తో ప్రవాస భారతీయ యువ బృందం భేటీ....
అమరావతి: మన దేశం గురించి తెలుసుకోండి అనే నినాదంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ విదేశాల్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. తమ మూలాలు ఇండియాతో ముడిపడి ఉన్న ఎన్నారైలు ఎవరైనా భారత్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపితే వారు ఇండియాలో పర్యటించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటనలో వారు భారతదేశ సాంస్కృతిక,రాజకీయ,పర్యాటక, అభివృద్దితో పాటు భూత,వర్తమాన, భవిష్యత్ విషయాలన్నింటిని తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ క్రమంలో వివిధ దేశాలకు చెందిన ప్రవాస భారత యువ బృందం భారత్ పర్యటనకు విచ్చేసింది. ప్రస్తుతం ఆ బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తోంది.
నో ఇండియా ఉద్దేశ్యం
ప్రవాస భారతీయ యువత భారతదేశం గురించి స్వల్ప కాల వ్యవధిలో సమగ్రంగా తెలుసుకునేలా 2016లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీయువకులకే ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. 20 నుంచి 25 రోజులపాటు భారత్ లో పర్యటన, అందులో 10 రోజులు ఏవైనా రెండు రాష్ట్రాల సందర్శనకు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తారు.
ఎన్నారై యూత్ టీమ్ ల రాక
భారతదేశం గురించి తెలుసుకోండి(నో ఇండియా) అనే నినాదంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రవాస భారతీయులను ఇండియా పర్యటనకు ఆహ్వానిస్తోంది. ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ ఆఫ్ ఇండియా ఆహ్వానం మేరకు వివిధ దేశాలకు చెందిన 40 మంది యువ ఎన్నారైలు ఒక బృందంగా ఏర్పడి భారతదేశ పర్యటనకు విచ్చేశారు. మలేషియా, మయన్మార్, దక్షిణాఫ్రికాతో పాటు మొత్తం 9 దేశాలకు చెందిన ఎన్నారైలు ఈ బృందంలో ఉన్నట్లు తెలిసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటన...
భారతదేశ పర్యటనలో భాగంగా ఆంధ్రపరదేశ్ లో పర్యటించేందుకు ప్రవాస భారత యువ బృందం మంగళవారం విజయవాడ చేరుకొంది. ఈ ఎన్నారై యూత్ టీమ్ కు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి ఎన్ఎల్పీ చౌదరి, సాంస్కృతిక వ్యవహారాలశాఖ సంచాలకులు విజయభాస్కర్ నేతృత్వం వహించారు.
లోకేశ్ తో భేటీ...
ముందుగా విజయవాడ చేరుకున్న ప్రవాస భారతీయుల యువ బృందం నేరుగా అమరావతి వెళ్లి సచివాలయంలో ఐటి మంత్రి లోకేశ్ను కలిసింది. ఈ సందర్భంగా లోకేశ్ వారికి రాష్ట్ర విభజన తరువాతి పరిణామాలు, అభివృద్ధి చేస్తున్న విధానం, రియల్ టైం గవర్నెన్స్ల గురించి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ మెరుగైన పరిపాలన కోసం టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటుందో ఎన్నారైలకు వివరించారు. ప్రత్యేకించి రియల్ టైం గవర్నెన్స్ పనితీరు, ప్రయోజనాలు, అందులో మేళవించిన ఆధునిక సాంకేతికత తదిదర అంశాలను వారికి వివరించారు.
రాష్ట్ర పర్యటనకు...
లోకేశ్ తో సమావేశం అనంతరం ఈ బృందం ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లింది. తొలుత విజయవాడ నగర సందర్శన అనంతరం విశాఖపట్నం లో ఈ ఎన్నారైల బృందం పర్యటిస్తుంది. ప్రకృతి అందాలతో అలరారే విశాఖలో పర్యటించి అక్కడ దర్శనీయ ప్రాంతాలు,ఆంధ్రా యూనివర్శిటీని సందర్శించనుంది. అనంతరం మళ్లీ విశాఖ నుంచి విజయవాడకు చేరుకొని కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ బృందం పర్యటిస్తుందని అధికారులు తెలిపారు.