చంద్రబాబుకు ఎన్టీఆర్కు పట్టిన గతే..! ఇంకా జగన్ ఏం పీ..?: కొడాలి నాని, పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్వించారు. చంద్రబాబును ప్రజలు రాజకీయంగా ఎప్పుడో సమాధి చేశారంటూ ధ్వజమెత్తారు. ఇక నారా లోకేష్ను మంగళగిరిలో పాతాళానికి తొక్కామని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.
ఇంకా ఏం పీకాలి..?
మహిళా రైతులు ఆందోళన చేస్తుంటే చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు. తోక పార్టీలను వేసుకుని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు ఏం పీకావ్? అని సీఎం జగన్ను అడుగుతున్నాడు. ఇంకా ఏం పీకాలి? మొన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సరిపోలేదా?' అని కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శించారు.
చంద్రబాబుకు నాని సవాల్..
ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడిన అందరి పేర్లు బయట పెడితే ఉన్న పళంగా కోర్టుకు వెళ్లి స్టేలు, గ్యాగ్ ఆర్డర్లు ఎందుకు తెచ్చుకున్నావ్ అంటూ ప్రశ్నించారు. ఒకే రాజధాని ఉండాలన్న మాట మీద నిలబడాలనుకుంటే చంద్రబాబు తన ఎమ్మెల్యేలు అందరితో రాజీనామా చేయించాలని.. ఎన్నికలకు వెళ్లి గెలిచి చూపిస్తే రాజధాని ఇక్కడే ఉంటుందని కొడాలి నాని చెప్పారు.
చంద్రబాబుకు ఎన్టీఆర్కు పట్టినే గతే.. జగన్ పార్టీకి 170 సీట్లు
ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు కబుర్లు చెబుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల నుంచి వెళ్లకూడదని.. ఆయన ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 170 సీట్లు వస్తాయన్నారు.
74 ఏళ్లు పూర్తికాగానే చంద్రబాబుకు కూడా ఎన్టీఆర్కు పట్టిన గతే పడుతుందని అన్నారు. మూడు రాజధానులు ఉండాలి.. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందేనని.. కృష్ణా జిల్లా వాసిగా తాను చెబుతున్నానని అన్నారు. వికేంద్రీకరణకే తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని అభివృద్ధి చేసి తీరుతామని తేల్చి చెప్పారు.
Recommended Video
చంద్రబాబుకు ముందు ముందు ముసళ్ల పండగే..: పేర్ని నాని
ఇది ఇలావుండగా, మరో మంత్రి పేర్ని నాని కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు భూదేవి తల్లితో నాటకాలాడుతున్నారని, మట్టి కొట్టుకుపోవడం ఖాయమని దుయ్యబట్టారు. దళితులను, పేదవాళ్లను వద్దని చీదరించుకునేవాళ్లు రైతులు ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. కొండమీదకు వెళ్లి అమ్మవారికి దొంగ దండం పెట్టుకుని వచ్చాడని.. గతంలో అమ్మవారి గుడిలో క్షుత్రపూజలు చేసినందుకు కాదా.. రాజకీయంగా భూస్థాపితమైంది అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు చౌదరికి ముందు ముందు ముసళ్ల పండగేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు పోరాటమంతా లోకేష్ కోసమేనని అన్నారు.