బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే.. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
కర్నూలు: తిరుపతి ఉపఎన్నిక పోలింగ్లో ఎవరూ దొంగ ఓట్లు వేయలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని అన్నారు. వైసీపీ అభ్యర్థి 4.5 లక్షల మెజార్టీ ఓట్లతో గెలువబోతున్నారని జోస్యం చెప్పారు. ఆయన సోమవారం కర్పూలులో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు చెప్పినట్లు దొంగ ఓట్లు వేసుంటే..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసివుంటే పోలింగ్ 80 శాతం లేదా 90 శాతం జరిగి ఉండాలని.. కానీ అలా జరగలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చేయడం అంటే.. లాక్డౌన్ పెట్టడం పరిష్కారం కాదని అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి, శానిటైజర్ వాడటం, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఓడిపోతామనే చంద్రబాబు, లోకేష్ నాటకాలు..
మరోవైపు వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా కూడా టీడీపీపై విమర్శలు గుప్పించారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో ఓటర్లు వైసీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 5 లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందుతారని అన్నిసర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ మేరకు ఓ వీడియోలో ఆమె మాట్లాడారు. ఘోరంగా ఓడిపోతామనే విషయాన్ని గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లు సరికొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డిని లోకేష్ వీరప్పన్ అని విమర్శించడం సిగ్గుచేటని రోజా అన్నారు.
జగన్ కొత్త సాంప్రదాయానికి తెరలేపారంటూ రోజా
నీచ రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని మండిపడ్డారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన ఖర్మ వైసీపీకి గానీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గానీ లేదన్నారు. ఎక్కడా డబ్బులు పంచకుండా.. ఎవరినీ ప్రలోభపెట్టకుండా.. ఏ విధమైన గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి సీఎం కొత్త సాంప్రదాయానికి తెరలేపారని చెప్పారు. కాగా, ఇతర జిల్లాల నుంచి 200కుపైగా బస్సుల్లో వచ్చిన కొందరు దొంగ ఓట్లు వేశారని, వీరికి పోలీసులు, అధికారులు సహకరించారంటూ చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, తదితరులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు, నేతలు కూడా వారికి ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.