లోకేష్ ఓ వేస్ట్ ఫెలో... దేవినేని ఉమా .. గన్ తో కాల్చుకో : మంత్రి కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు
రాజధాని ప్రాంతంలో రైతులకు బేడీలు వేయడం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మరోవైపు టిడిపి నేతలపై విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు. ఈ క్రమంలోనే కొడాలి నాని నారా లోకేష్ ను దేవినేని ఉమను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
పోలవరం నిధుల కుదింపు మీ కేసుల మాఫీ కోసమే .. చేతకాని 22 మంది ఎంపీలు ఎందుకు? లోకేష్ ఫైర్
నారా లోకేష్ , దేవినేని ఉమాలపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నానీ
తాజాగా నారా లోకేష్ రైతులతో పెట్టుకుంటే జగన్ ను గోచీ తో నిలబెట్టే రోజు దగ్గరలో ఉందంటూ ఘాటుగా చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు మంత్రి కొడాలి నాని. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై, టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా పై వైసీపీ మంత్రి కొడాలి నాని మరోమారు విరుచుకుపడ్డారు. నారా లోకేష్ పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
వరి చేనుకు చేపల చెరువుకు తేడా తెలీని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా
అతను ఒక వేస్ట్ ఫెలో అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఎక్కడ తిరిగినా ఏం ప్రయోజనం ఉండదని, వరి చేనుకి చేపల చెరువుకి తేడా తెలియని మేధావి అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీలు తగ్గించండి అని అడిగితే బషీర్ బాగ్ వద్ద కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది అంటూ కొడాలి నాని మండిపడ్డారు.
ఇప్పుడు రైతులకు బేడీలు వేశామని, దేవినేని ఉమా కూడా బేడీలు వేసుకుని సంకెళ్ళ నాటకమాడుతున్నారని మండిపడిన కొడాలి నాని, అప్పుడు బషీర్ బాగ్ లో కాల్పులు జరిపితే, ఆ సమయంలో ఉమా గన్ తో ఎందుకు కాల్చుకోలేదు అంటూ ప్రశ్నించారు.
రైతులను అద్దం పెట్టుకుని టీడీపీ బృందం రాద్దాంతం
అమరావతి లో ఉన్న రైతులు మాత్రమే రైతులు కాదని, అమరావతిలో భూములు కొన్నారు కాబట్టి టిడిపి నేతలు అనవసరపు హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు కొడాలి నాని. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్ళు వేశామని చెప్పి న మంత్రి కొడాలి నాని , సంకెళ్లు వేసిన వారి పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. రైతులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు బృందం రాద్ధాంతం చేస్తోందని విమర్శల వర్షం కురిపించారు.
Recommended Video
బషీర్ బాగ్ కాల్పులు ఘటనకు బాధ్యత వహిస్తూ దేవినేని ఉమా గన్ తో కాల్చుకో..
బషీర్ బాగ్ కాల్పులు ఘటనకు బాధ్యత వహిస్తూ దేవినేని ఉమా తనను తాను గన్ తో కాల్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించిన కొడాలి నానీ పోలవరం ఇబ్బందులకు దేవినేని ఉమానే కారణం అని విమర్శించారు .రైతుల కోసం పని చేసే ప్రభుత్వం తమదని పేర్కొన్న కొడాలి నానీ , జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు . రైతుల ఆశీస్సులు సీఎం జగన్కు ఉన్నాయని టీడీపీ నేతలు రైతులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు .