చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించండి ..లేకుంటే కష్టమే..సలహా ఇచ్చిన కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 42 శాతం విజయం సాధించిందని చంద్రబాబు మాట్లాడటంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం గెలుపు ఎక్కడ వచ్చిందో చంద్రబాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.
చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్న కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడిన పంచాయతీ ఎన్నికలలో సంఖ్యాపరంగా వైసీపీ గెలిచినా, విజయం టీడీపీ దేనని టిడిపి నేతలు చెప్పుకుంటే, వైసిపి నేతలు చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కొనసాగిందని, టీడీపీకి ప్రజలు బాగా బుద్ధి చెప్పారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు.
42 శాతం అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని చంద్రబాబుకు కొడాలి నానీ సవాల్
42 శాతం అభ్యర్థులను గెలిచామని చెబుతున్నారని, 42 శాతం అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని సవాలు చేశారు. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చంద్రబాబుకి పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు ఆయనను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి కి పంపడం ఖాయమని మంత్రి ఎద్దేవా చేశారు. అంతే కాదు మా నాయకుడు వైయస్ జగన్ చంద్రబాబు కుప్పంలో కూడా చుక్కలు చూపించారని కుప్పంలో నేము 75 స్థానాలు గెలిస్తే ఇక బాబు 42 శాతం ఎక్కడ గెలిచినట్లు ? చెప్పాలని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
తెలుగు తమ్ముళ్లు ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలన్న కొడాలి నాని
చంద్రబాబు జూమ్ యాప్ లో పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు పిచ్చితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారని, ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్లు ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని కొడాలి నాని సలహా ఇచ్చారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచేది వైసీపీనే
పార్టీ గుర్తు లేకుండా పోటీ చేసే పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి పట్టం కట్టారు అంటే , పార్టీ గుర్తు తో జరిగే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని కొడాలి నాని పేర్కొన్నారు. పార్టీ గుర్తులతో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడతారని విజయం వైసిపిదేనని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని పేర్కొన్న కొడాలి నాని రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గెలిచేది మాత్రం వైసిపినేనని గట్టిగా చెబుతున్నారు.