జగన్ వస్తే దించలేనని తెలుసు, పవన్ కళ్యాణ్ తిట్టినా, నీబతుకేంటో ఎన్టీఆర్ చెప్పారు: బాబుపై కొడాలి నాని
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జగన్ బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారనీ, కేసుల మాఫీ కోసం మోడీ కాళ్లు పట్టుకున్నట్లు చెప్పించడం విడ్డూరమన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్వయంగా తన నోటితో చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి ఎవరూ లేరని చెప్పారన్నారు.
నీ గురించి, నీ బతుకు గురించి పిల్లనిచ్చిన మామే చెప్పాడని, నువ్వొక వెన్నుపోటుదారుడివని, నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఎవరూ లేరని ఎన్టీఆరే చెప్పారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. నరేంద్ర మోడీ చంక నాలుగున్నరేళ్లు నాకారన్నారు. ఆయనంత గొప్ప ప్రధాని లేడని చెప్పారన్నారు. ఇప్పుడు తాము బీజేపీతో కలిశామని చెప్పడం విడ్డూరమన్నారు.
అందరి టార్గెట్ విజన్ 2050: చంద్రబాబు-జగన్లది ఒకేమాట, మరోదారిలో పవన్ కళ్యాణ్
జగన్ అధికారంలోకి వస్తే దించలేమని చంద్రబాబుకు తెలుసు
కృష్ణా జిల్లా గుడివాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జన్మభూమి కార్యక్రమం తీరు, జగన్ పైన టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. తమ పార్టీ అధినేతపై టీడీపీ విమర్శలలో పస లేదని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వస్తే దించలేమని చంద్రబాబుకు తెలుసునని అన్నారు.
పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి తిడుతున్నా కలుద్దామంటున్నారు
చంద్రబాబు లాంటి అవినీతిపరుడు లేడని స్వర్గీయ నందమూరి తారక రామారావే స్వయంగా చెప్పారని కొడాలి నాని అన్నారు. నాలుగున్నరేళ్లు ప్రధాని నరేంద్ర మోడీకి మొక్కిన చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సూటుకేసులు మోస్తున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి తిడుతున్నా తమతో కలిసి రావాలని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్ రావు సభాపతిగా ఉన్నంత కాలం తాము సభకు వెళ్లమని చెప్పారు.
ఈ పోటుగాళ్లు సంవత్సరానికి 365 రోజులు వెళ్తున్నారా
2014లో తమ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొనుగోలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు వారితోనే విమర్శలు చేయిస్తూ బహిరంగ లేఖ రాయించడం సిగ్గుచేటు అని కొడాలి నాని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారన్న టీడీపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఈ పోటుగాళ్లు సంవత్సరానికి 365 రోజులు అసెంబ్లీకి వెళ్తున్నారా, బడ్జెట్ సెషన్ ఓ 20 రోజులు, శీతాకాలం, వర్షాకాల సమావేశాలు మరో పది రోజులు అన్నీ కలిసి మహా అయితే ముప్పై రోజులు వెళ్తున్నారన్నారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభలో ఉంటారని చెప్పారు.
చంద్రబాబు సూచనలతో అసెంబ్లీ
కేవలం ఓ నెల రోజుల పాటు అసెంబ్లీకి హాజరై 365 రోజుల జీతాలను టీడీపీ నేతలు తీసుకుంటున్నారని కొడాలి నాని అన్నారు. టీడీపీ నేతలు నెల రోజుల జీతం మినహా మిగిలిన దానిని వెనక్కి ఇస్తారా అని ప్రశ్నించారు. అప్పుడు మేం అందుకున్న వేతనాలు కూడా తిరిగిస్తామన్నారు. అసెంబ్లీకి హాజరై జగన్ మాట్లాడితే మైక్ కట్ అవుతుందన్నారు. రోజా, తనలాంటి వారు గట్టిగా నిలదీస్తే ఒకట్రెండేళ్లు సస్పెండ్ చేస్తారన్నారు. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు వస్తాయని, అడ్డమైన వాళ్ల దగ్గరకు వెళ్లి సమాధానాలు చెప్పేలా చేస్తారన్నారు. స్పీకర్ కోడెల వంటి వ్యక్తిని ప్రజలు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. గతంలో పార్టీ మారినందుకు జోగి రమేష్, పేర్ని నానిలతో పాటు తనను స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిస్క్వాలిఫై చేశారని గుర్తు చేసుకున్నారు. 11 నెలల పదవీకాలం మిగిలి ఉండగా ఈ చర్య తీసుకున్నారని, ఇప్పుడు అసమర్థుడైన స్పీకర్ చంద్రబాబు సూచనలతో అసెంబ్లీని నడుపుతున్నారన్నారు.
తెలంగాణ ప్రజలు గుడ్డలూడదీసి పంపినా సిగ్గురాలేదు
అందుకే తాము సభకు వెళ్లడం లేదని కొడాలి నాని చెప్పారు. తాము ఏమీ ఒళ్లు బలిసి వెళ్లకుండా ఉండటం లేదన్నారు. గతంలో వైయస్ పైన, ఇప్పుడు జగన్ పైన చంద్రబాబు తన ఎల్లో మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడకు పోటుగాడిలాగా వెళ్లిన చంద్రబాబును ప్రజలు గుడ్డలు ఊడదీసి పంపారన్నారు. అయినా సిగ్గు రాలేదన్నారు. జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ముఠా నాయకుడనీ, హత్యలు చేయిస్తాడని తన సొంత మీడియాలో ప్రచారం చేశారన్నారు.