కొండా సురేఖ: మద్దతుపై తెరాస, కాంగ్రెస్లకు కోదండ షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీలకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి షాక్ ఇవ్వనుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై జెఏసిలో సోమవారం ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో 18వ తేదీన మరోసారి భేటీ అయి ఎవరికి మద్దతివ్వాలనే విషయమై చర్చించి, తేల్చనున్నారు. అయితే, ప్రాథమికంగా పార్టీల పరంగా కాకుండా ఉద్యమంలో పాల్గొన్న అభ్యర్థులకు పార్టీలకతీతంగా మద్దతివ్వాలని భావిస్తున్నారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను బహిష్కరించాలని భావిస్తున్నారు. కాంగ్రెసు, తెరాస, బిజెపిలలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అభ్యర్థులకు మద్దతివ్వనున్నారు. కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి వంటి నేతలను పార్టీలో చేర్చుకున్న తెరాసకు ఎలా మద్దతిస్తామని జిల్లా జెఏసి నేతలు ప్రశ్నించారని సమాచారం. మరోవైపు ఏ పార్టీకి మద్దతిచ్చినా ఇబ్బంది తప్పదని, తటస్థంగా ఉండటం మంచిదని పలువురు సూచించారు.
మోడీతోనే అభివృద్ధి: వెల్లంపల్లి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, చిరంజీవి అనుచరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి పేరు ప్రకటించినప్పటికీ ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. విజయవాడ బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వెల్లంపల్లికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర నష్టపోయిందని, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వల్లే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే సీమాంధ్రలో 13 జిల్లాలను అభివృద్ధి చేస్తారనే విశ్వాసం తనకుందన్నారు. బిజెపిలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. మోడీ ప్రధాని అయితే సీమాంధ్రలో 13 జిల్లాలను అభివృద్ధి చేస్తారనే విశ్వాసం తనకు ఉందని అన్నారు.
చల్లబడ్డ పేర్ని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పేర్ని నాని చల్లబడ్డట్లుగా కనిపిస్తోంది. మచిలీపట్నంలో కార్యకర్తలతో సమావేశం అయిన అనంతరం ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు తాను పోటీ చేస్తానని, 19న నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు.