అయినా అప్రమత్తంగా ఉండాలి: కోదండరామ్ సూచన
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం చరిత్రకే పాఠాలు నేర్పించే విధంగా సాగిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వం కోసం చేసింది కాదని, వనరులపై అధికారం కోసమేనని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాదులోని ఆబిడ్స్లోని ఆంధ్రా సారస్వత పరిషత్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రచించిన తెలంగాణ జైత్రయాత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా కోదండరాం, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ తదితరులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజల పరిరక్షణ కోసం చక్రపాణి తన కలాన్ని ఉపయోగించారని కోదండరామ్ అన్నారు. అనుభవంలోంచి వచ్చిన వ్యాసాల సమూహమే తెలంగాణ జైత్రయాత్ర అని ఆయన అన్నారు. ఉద్యమంలో జరిగిన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారని అన్నారు.
2019లో అధికారంలోకి వస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి లాంటి నాయకులు మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని సాధించిన తరువాత కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. అభివృద్ధి అంటే భవనాలు నిర్మించడం కాదు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడమని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమం గొప్ప చరిత్రగలదని ఉద్యమాన్ని విశ్లేషించడం గొప్ప విషయమని కె. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో మేధావులు ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలంటే జైత్రయాత్ర పుస్తకం చదివితే సరిపోతుందని అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థావాన్ని చక్రపాణి చక్కగా వివరించారన్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించే ప్రయత్నమే ఈ రచన అని అన్నారు.
తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు ఘంటా చక్రపాణి తెలిపారు. కార్యక్రమంలో రమా మేల్కొటే తదితరులు పాల్గొన్నారు.