కోడెల వర్సెస్ అంబటి : నీవు అసలు నాకు పోటీయే కాదు.. 928 ఓట్లే నీకు ఆధిక్యం: మాటల తూటాలు..!
Recommended Video
టిడిపి నేత కోడెల శివప్రసాద్ వైసిపి నేత అంబటి రాంబాబు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి మరొకరు సవాళ్లు చేస్తున్నారు. పోలింగ్ నాడు ఇనిమెట్లలో జరిగిన వ్యవహారం పై కోడెల ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. అదే సమయంలో అంబటి పై కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి ప్రతిగా అంబటి రాంబాబు సైతం కోడెల పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇద్దరి మధ్య డైలాగ్ వార్ పతాక స్థాయికి చేరింది.
చంద్రబాబు తో కోడెల సమావేశం
టిడిపి అధినేత చంద్రబాబు తో సత్తెనపల్లి పార్టీ అభ్యర్ది కోడెల శివప్రసాద్ భేటీ అయ్యారు. ఇనిమెట్లలో పోలింగ్ రోజున జరిగిన పరిణామాలను కోడెల వివరించారు. తన పైన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రతీ అంశంలో వారు జోక్యం చేసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. తన పైనా కేసు నమోదు చేసిన విషయాన్ని సీయం దృష్టికి తీసుకొచ్చారు. తనపై కేసు పెట్టినా ఇబ్బంది లేదని అసలు ఆ రోజు ఏం జరిగిందో వీడియోలు విడుదల చేయాలని కోరారు. వీడియోలు విడుదల చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని కోడెల చెప్పుకొచ్చారు.
వారందరిదీ ఒకటే గ్యాంగ్..
తన పైన పధకం ప్రకారమే దాడి జరిగిందని కోడెల వివరించారు. వైసిపి..మోదీ..ఎన్నికల సంఘం అంతా ఒకటే గ్యాంగ్ అని విమర్శించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గొడవలు చేయండి.. దాడులు చేయండి అని సంకేతం ఇచ్చేలా కేంద్ర బలగాలను తగ్గించేసారన్నారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఇనిమెట్ల పోలింగ్ బూత్లో ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ ద్వారా చూడాలని కోరారు. రెచ్చగొట్టే ధోరణితో వైసిపి వ్యవహరించినా..తాము సంయమనంతో ఉన్నామన్నారు. కేసులు పెట్టినా తాను భయపడేది లేదని స్పష్టం చేసారు. తనకు రక్షణగా వచ్చిన పోలీసులు, గన్మెన్ల పైనా దాడులు చేసారని వివరించారు. ఇక, అంబటి రాంబాబు అసలు తనకు పోటీయా అని కోడెల ప్రశ్నించారు.
కోడెల టిడిపి అభ్యర్దులనూ ఓడించారు..
వైసిపి నేత అంబటి రాంబాబు సైతం కోడెల అదే విధంగా చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు. తాత్కాలిక సీయంగా ఉన్న వ్యక్తి పోలవరం పైన ఎలా రివ్యూ చేస్తారని ప్రశ్నించారు. కోడెల పోలింగ్ నాడు ఇనిమెట్ల బూత్లోకి వెళ్లి తలుపులు వేసుకొని రిగ్గింగ్ కు ప్రయత్నించారని ఆరోపించారు. కోడెల క్రిమినల్ మైండ్తో రాజకీయాలు చేసే వ్యక్తి అని ఆరోపించారు. ఆయన రిగ్గింగ్కు ప్రయత్నించటంతోనే గ్రామస్థులు తిరగబడ్డారని వివరించారు. అహంకారంతో మాట్లాడుతున్న కోడెల గత ఎన్నికల్లో తనపై 928 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారని గుర్తు చేసారు. గత ఎన్నికల్లో నర్సరావుపేట నుండి పోటీ చేసిన బిజెపి అభ్యర్దిని..ఇప్పుడు పోటీ చేసిన టిడిపి అభ్యర్దిని ఓడించారాని చెప్పుకొచ్చారు. నర్సరావుపేట, సత్తెనపల్లి ప్రజలకు కోడెల నరకం చూపించారని విమర్శించారు.