దు:ఖసాగరంలో మునిగిన నరసారావుపేట : కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు
అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంతిమయాత్ర నరసారావుపేటలో కొనసాగుతుంది. హితులు, సన్నిహితులు వెంట రాగా, కుటుంబసభ్యుల రోదనలతో, టీడీపీ శ్రేణులు పాదం పాదం కలుపగా అంతిమయాత్ర సాగుతోంది. నరసారావుపేట నుంచి కోడెల శివప్రసాద్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా విధులు నిర్వర్తించి, నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతీ ఒక్కరిని పేరుతో ఆప్యాయంగా పలకరిస్తూ ..ఉండేవారని, మంచి చెడులను తెలుసుకొనేవారని గుర్తుచేస్తుకుంటూ గద్గత స్వరంతో రోదిస్తున్నారు నరసారావుపేట స్థానికులు.
కోడలె శివప్రసాద్ ఇంటి నుంచి అంత్యక్రియలు నిర్వహించే చోటుకు భారీగా జనం తరలిరాగా అంతిమయాత్ర జరుగుతుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్వయంగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. తమ నేతకు కన్నీటి వీడ్కోలు పలుకున్నారు, చంద్రబాబుతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇతర టీడీపీ నేతలు ఉన్నారు.
మరోవైపు అంతిమయాత్ర వాహనంపై టీడీపీ నేత, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ అభిమాన నేత కోడెల శివప్రసాద్ లేరనే వార్తను నరసారావుపేట వాస్తవ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతూ అంతిమ వీడ్కోలు పలుకున్నారు.