గవర్నర్ కు ఇనుమెట్ల ఘటనపై ఫిర్యాదు చేసిన కోడెల .. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సుదీర్ఘ చర్చ
ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై పోలింగ్ రోజున ఇనుమెట్లలో దాడి ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది .మొదట కోడెలపై దాడి చేసిన ఘటనలో దాడికి పాల్పడిన వారిపై, వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు , వైసీపీ అధినేత జగన్ గవర్నర్ ను కలిసి గవర్నర్ కు, ఈసీ కి ఫిర్యాదు చెయ్యటంతో కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై కోడెల తాజాగా గవర్నర్ ను కలిసిన స్పీకర్ కోడెల ఎన్నికల సమయంలో ఘర్షణలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం .
చంద్రబాబు..పవన్ కలిసారు: చిరంజీవి ఆయనతో ఏం చెప్పారు : అందరి దృష్టి వారి మీదే : ...!
ఇనుమెట్ల ఘటనపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసిన కోడెల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి ఘటన రాజభవన్ కు చేరుకుంది. ఏప్రిల్ 11న సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్ద జరిగిన దాడి ఘటనపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదుచేశారు కోడెల శివప్రసాదరావు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని కోడెలతోపాటు తెలుగుదేశం పార్టీ సైతం ఆరోపిస్తుంది. అటు కోడెలపై తాము దాడి చెయ్యలేదని ఆయనే చొక్కాలు చింపుకుని సానుభూతి పొందాలని ప్రయత్నించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఇప్పటికే ఫిర్యాదు చేసిన వైసీపీ .. ఇప్పుడు కోడెల ఫిర్యాదు
ఇప్పటికే గవర్నర్ ను కలిసి ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలను , కోడెల పోలింగ్ బూత్ ను స్వాధీనం చేసుకున్న ఉదంతాన్ని వైసీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు వివరించారు . ఇక తాజాగా ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు . ఏప్రిల్ 11న ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్ద తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 5సంవత్సరాలు సభ సజావుగా నడపడానికి పలు సలహాలు, సూచనలు చేసిన గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఎన్నికల్లో జరిగిన ఘర్షణలపై గవర్నర్, స్పీకర్ మధ్య చాలాసేపు చర్చ జరిగింది .ఎన్నికల నిర్వహణకు కావలసిన భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని గవర్నర్ దృష్టికి స్పీకర్ కోడెల తీసుకు వెళ్ళారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితులపై గవర్నర్ , స్పీకర్ మధ్య సుదీర్ఘ చర్చ
ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త గవర్నమెంట్ ఏర్పాటు కావడానికి మరో రెండు నెలలు సమయం ఉన్న నేపధ్యంలో ఈలోపు రాష్ట్ర పరిపాలనా ఆగకుండా సీఎం చంద్రబాబు చేస్తున్న సమీక్షలు, సమావేశాలపైన కూడా కోడెలకు స్పీకర్ కు మధ్య చర్చ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమీక్షలు, సమావేశాలు, రాష్ట్ర పరిపాలనలో ఎలక్షన్ కమీషన్ జోక్యం చేసుకోవడంపై ఇద్దరి మధ్య జరిగిన చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది . పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయడానికి సంబంధించి కూడా గవర్నర్, స్పీకర్ మధ్య చర్చ జరిగినట్టు సమాచారం . దీనికి రాజ్యాంగ సవరణ అవసరం అని గవర్నర్, స్పీకర్ అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది .