కేసులు, ఆరోపణలపై స్పందించిన కోడెల .. ఆరోపణలు కాదు ఒక్క ఆధారం చూపించండని సవాల్
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనపై , తన కుటుంబం పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై, నమోదు అవుతున్న కేసులపై స్పందించారు . మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ స్పీకర్ గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు తెలిపారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. కావాలని వైసీపీ తన కుటుంబాన్ని టార్గెట్ చేసి తన కుమార్తెపై , కుమారుడిపై కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు . ఇప్పటి వరకు 8 కేసులు నమోదు అయ్యాయని ఇంకా ఎన్ని కాసులు పెట్టిస్తారో తెలీటం లేదని ఆవేదన చెందారు. ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే తనను ఇన్ని పదవులు వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు. తన కుటుంబసభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని తాను గతంలోనే చెప్పినట్లు కోడెల గుర్తు చేశారు.
మాజీ మంత్రి నారాయణకు షాక్ .. అనుమతులు లేవని నారాయణ స్కూల్ సీజ్ , లక్ష జరిమానా
తమ కుటుంబాన్ని ప్రభుత్వం కావాలనే వేధిస్తోంది ... అందుకే కుటుంబ సభ్యులపై కేసులు అన్న మాజీ స్పీకర్
తన కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని... ఇది మంచి పద్ధతి కాదని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇష్టారాజ్యంగా భూ కబ్జాలు చేశామని , కే ట్యాక్స్ వసూలు చేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన ఆన్నారు. తనపై చేసిన ఆరోపణలపై ఒక్క ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పధకం ప్రకారమే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని ఆయన బాధ వ్యక్తం చేశారు . తన కుమారుడు వైద్యుడని, ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నాడని తెలిపారు. కానీ ఎప్పుడూ రాజకీయాల్లో లేడని పేర్కొన్నారు. అలాగే, తమ భవనాలను ప్రభుత్వానికి అత్యధిక ధరకు అద్దెకు ఇచ్చినట్టు వస్తున్న ఆరోపణలను కూడా కోడెల ఖండించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అద్దె చెల్లిస్తున్నారని తెలిపారు. అప్పట్లో కేవలం రూ.20లుగా నిర్ణయించారని, జీఎస్టీ పోను తమకు వస్తున్నది రూ.15 మాత్రమేనని అందులో తాము చేసిన అవినీతి ఏమి లేదని ఆయన తెలిపారు.
విజయసాయి రెడ్డి ట్వీట్లు కరెక్ట్ కాదు ... వేధిస్తే ఊరుకునేది లేదు అన్న కోడెల
ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తామంటే సహకరిస్తామని చెప్పిన ఆయన అక్రమాలు చేస్తే మాత్రం పోరాటాలు చేస్తామన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోమని తప్పక ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. గతం లో ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరించినప్పుడు సభకు రావాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశానని ఆయన గుర్తుచేశారు.వైసీపీ నేత విజయసాయి రెడ్డి రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. విజయసాయి రెడ్డి చేసేది ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆయన మండిపడ్డారు. స్పీకర్ పదవికి తాను కళంకం తెచ్చానని విజయసాయి రెడ్డి ఆరోపించడం సరికాదన్నారు.బాధితులు బయటకు వచ్చి కోడెల ఫ్యామిలీపై కేసులు పెట్టాలంటూ విజయసాయిరెడ్డి పెట్టే ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
నేరం చేసినట్టు ఒక్క ఆధారం చూపించండి .. రాజకీయాల నుండే తప్పుకుంటా .. కోడెల సవాల్
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇతర పార్టీల కార్యకర్తలపై ఎన్నడూ దాడులకు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాలను విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. తాను కేసులకు భయపడేది లేదన్నారు. తానే తప్పు చెయ్యలేదని అన్నారు. తానూ నేరం చేశానని ఆరోపించే నేతలు కనీసం ఒక్క ఆధారం అయినా తీసుకురావాలని, అలా తెస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని వైసీపీ నేతలను కోరారు.