అవును, రోజాను పిలిచాం: కోడెల, ఆమె అరెస్టుపై నో కామెంట్
రోజాను సదస్సు పిలిచామని చెప్పి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆమెను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై మాట్లాడడానికి నిరాకరించారు.
హైదరాబాద్: ఇటీవల జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించిన మాట నిజమేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. అయితే సదస్సుకు వస్తున్న రోజాను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేయడంపై మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. శాసనసభ హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మహిళా సదస్సు సందర్భంగా మీడియా సమావేశంలో తాను అనని మాటలను అన్నట్లు వక్రీకరించడం తనను బాధించిందని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఆయన మీడియాకు చూపించారు. దానిపై ఏమైనా చర్యలుంటాయా అని ప్రశ్నించగా - ఎందుకుండవు? తప్పకుండా ఉంటాయన్నారు.
తనకు 1983 నుంచి హైదరాబాద్తో అనుబంధం ఉందని, అది నేటితో తెగిపోతోందని ఒక వైపు బాధ, సొంత రాష్ట్రంలో అసెంబ్లీ నిర్మాణం పూర్తయి, ఇకపై అక్కడే పూర్తి స్థాయి సమావేశాలు జరుగుతాయన్న ఆనందం రెండూ ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ హైదరాబాద్లో మూడు బడ్జెట్, ఒక ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. మార్చి తొలివారం నుంచి, బహుశా 3 నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు.
తాను చెప్పిన మొత్తం సమాధానంలో కేవలం ఒక వాక్యం తీసుకుని.. మహిళలు బయటకు రావడం వల్లే, వారిపై వేధింపులు జరుగుతున్నాయని తాను అన్నట్లుగా వక్రీకరించారని కోడెల వివరించారు.