నేనలా చెప్పలేదు, కోడిగుడ్డుపై ఈకలు పీకడం సరి కాదు: కోడెల
హైదరాబాద్: ఎన్నికల్లో తాను 11 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు ఎక్కడా చెప్పలేదని, కోడిగుడ్డుకు ఈకలు పీకడం సరి కాదని ఆంధ్రప్రదేశ్ శానససభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగిందని మాత్రమే తాను చెప్పానని ఆయన అన్నారు.
డబ్బులు ఎక్కువ ఖర్చయ్యాయనని తాను అన్నానని, 11 కోట్ల రూపాయల ఖర్చు చేశానని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. మైదుకూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు రఘురామిరెడ్డి రాజీనామా లేఖ తనకు అందలేదని కోడెల శివప్రసాద రావు శనివారంనాడు మీడియాతో చెప్పారు.
'అన్న ఎన్టీఆర్ పిలిచి సీటు ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగింది. 1983లో రూ.30 వేలు ఖర్చు పెట్టి గెలిచా. మొన్న ఎలక్షన్లలో రూ.11 కోట్లు ఖర్చు పెట్టాను. ఎన్నికల ఖర్చు కోసం కొందరు అవినీతికి పాల్పడుతున్నారు.' అని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి.
కాగా, కోడెల శివప్రసాద రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయన అంబటి రాంబాబు తదితర వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు.