ఇంట్లో దీక్ష, 3గంటలకోసారి లోపలికి: జగన్పై కోడెల ఫైర్
హైదరాబాద్: ఇంట్లో కూర్చొని దీక్షలు చేసే వారిని తాను ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ...ఇంట్లో దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి మూడు గంటలకోసారి ఇంట్లోకి వెళ్లారని తెలిపారు. దానిని దీక్ష అంటారా అని కోడెల ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన ఇరుప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో ఢిల్లీలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు దీక్షను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి బుధవారం విమర్శించడంతో కోడెల ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లుపై న్యాయ సహాయం కోరాలని కోడెల శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంశంతో యూపిఏ సర్కారు మైనార్టీలో పడిందని అన్నారు. సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోబోమని కోడెల శివప్రసాద్ హెచ్చరించారు.