కోడెల మృతిపై శివరాం స్టేట్మెంట్ రికార్డ్ చేసిన టీ పోలీసులు: ఏం చెప్పారంటే?
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులు కోడెల కుటుంబసభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు చేరుకుని కోడెల ప్రసాదరావు కుమారుడు శివరాంను విచారించారు. కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం.
ఇప్పటికే ఇంట్లో పనివాళ్లు, గన్మెన్లను విచారించి పోలీసులు స్టేట్మెంట్ నమోదు చేశారు. కోడెల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా గతంలోనే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తండ్రి అపకర్మలు నిర్వర్తించాల్సి ఉన్నందున సమయం కోరారు కోడెల శివరాం.
ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులే గుంటూరుకు వచ్చి కోడెల శివరాంను విచారణకు పిలిపించారు. తన తండ్రి కోడెల శివప్రసాదరావు ఏపీ సర్కారు పెట్టిన కేసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని కోడెల శివరాం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం. తన తండ్రి ఆత్మహత్య చేసుకునే ముందే తాను విదేశాలకు వెళ్లానని, తనకు తన కుటుంబసభ్యులు చెబితేనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలిసిందని చెప్పినట్లు సమాచారం.
తమ తండ్రితో ఎలాంటి గోడవలు లేవని శివరాం చెప్పారు. కోడెల శివప్రసాదరావు భార్య నుంచి కూడా తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. కేసుల ఒత్తిడి కారణంగానే తన భర్త చనిపోయారని కోడెల భార్య చెప్పినట్లు తెలిసింది. తన భర్త ఎప్పుడూ దేనికీ భయపడే వ్యక్తి కాదని ఆమె చెప్పినట్లు సమాచారం. తన భర్తను కేసులతో ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పారు.