కోర్టులో లొంగిపోయిన కోడెల తనయుడు శివరాం: ఆరు కేసుల్లో బెయిల్: ఇక..తండ్రి ఆత్మహత్య కేసులో..!
మాజీ స్పీకర్..దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన అనేక అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. వీటి మీద తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివరాం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే..ఈ కేసుల విషయంలో స్థానిక కోర్టును ఆశ్రయించాలని..అక్కడ బెయిల్ కు అభ్యర్ధన చేయాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు శివరాం కోర్టులో లొంగిపోయారు.
ఆయనకు ఆరు కేసుల్లో బెయిల్ లభించింది. ఇక, కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య కేసులో విచారణ కోసం హాజరు కావాల్సిందాగా ఆయన పిల్లిద్దరికీ పోలీసులు సమాచారం ఇచ్చారు. 11వ రోజు కార్యక్రమం ముగిసిన తరువాత తము వస్తామని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యవహారంలోనూ శివరాం హైదారబాద్ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది.
కోర్టులో లొంగిపోయిన శివరాం..
కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం నర్సరావు పేట కోర్టులో లొంగిపోయారు. ఆయన మీద అనేక కేసులు పెండింగ్ లో ఉన్నారు. కే టాక్స్ పేరుతో ఉద్యోగాలు..కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ అనేక మంది వద్ద ఆయన డబ్బులు వసూలు చేసి మోసం చేసారని అనేక కేసులు నమోదయ్యాయి. దీని పైన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కోడెల సంతానం హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన కోర్టు సైతం స్పష్టమైన సూచనలు చేసింది. కేసులు నమోదైన జ్యూరిస్డిక్షన్ కోర్టుకు హాజరై..అక్కడే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కెన్యా వెళ్లిపోయిన శివరాం
దీంతో..కోడెల మరణానికి మందు కెన్యా వెళ్లిపోయిన శివరాం..తండ్రి మరణం తో తిరిగి వచ్చారు. ఇప్పుడు తండ్రి 11వ రోజు కార్యక్రమాలు కూడా ముగియటంతో ఆయన ఈ రోజు నర్సరావు పేట కోర్టులో హాజరయ్యారు. ఆయన మీద నమోదైన వాటిల్లో ఆరు కేసుల్లో శివరాంకు బెయిల్ లభించింది. కేసుల్లో విచారణ కొనసాగనుంది. దీని ద్వారా మిగిలిన కేసుల విషయంలోనూ న్యాయ పరంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
తండ్రి అధికారం సమయంలో..కే టాక్స్
కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్న సమయంలో శివరాం..ఆయన సోదరి అనేక అక్రమ వసూళ్లు చేసారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. గడ్డి వ్యవహారం మొదలు ఆస్పత్రుల్లో మందుల వరకూ అదే విధంగా రైల్వే కాంట్రాక్టర్ల మొదలు చిన్న స్థాయి వ్యాపారుల వరకు అనేక అంశాల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేసారనే ఫిర్యాదులు నమొదయ్యాయి. ఇక..అనేక మందికి ఉద్యోగాల పేరుతోనూ.. కాంట్రాక్టుల పేరుతోనూ డబ్బులు స్వీకరించారు. అదే విధంగా ఒక ప్రభుత్వ శాఖలోని కంప్యూటర్లను సైతం దుర్వినియోగం చేసారనే అభియోగం ఉంది.
టీడీపీ నేతలు
అయితే..కోడెల కుటుంబాన్ని వేధించేందుకే ఇటువంటి కేసులు నమోదు చేసారంటూ టీడీపీ నేతలు ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. కోడెల మరణానికి సైతం ప్రభుత్వ వేధింపులే కారణమని ఆరోపించారు. ఇటువంటి సమయంలో కోడెల కుమారుడు ఈ కేసుల వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే కోర్టుకు హాజరయ్యారు.
తండ్రి ఆత్మహత్య కేసులో..
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య సమయంలో కుమారుడు శివరాం కెన్యాలో ఉన్నారు. అయితే...ఆ రోజున కోడెల అల్పాహారం స్వీకరించిన తరువాత తన గదిలోకి వెళ్లి తొలుత తాను కట్టుకున్నలుంగీతో ఆత్మహత్య కు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవటంతో కేబుల్ వైర్లతో బలవంతంగా ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇదే తరహాలో పోలీసులు కేసు నమోదు చేసారు.
అయితే దీనికి ముందు కోడెల తన పర్సనల్ ఫోన్ ద్వారా ఎవరితోనో సుదీర్ఘంగా మాట్లాడినట్లు గుర్తించారు. ఆ మాట్లాడిన వారి గురించి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే..ఆ పర్సనల్ ఫోన్ దొరకలేదని చెప్పుకొచ్చారు. దీంతో.. కోడెల కుమారుడు శివరాంను విచారణకు రావాల్సిందిగా పోలీసులు కోరారు. తన తండ్రి 11వ రోజు కార్యక్రమాలు పూర్తయిన తరువాత హాజరవుతానని శివారం సమాధానం ఇచ్చారు. ఇప్పుడు కార్యక్రమాలు పూర్తి కావటంతో..హైదరాబాద్ పోలీసుల ముందు శివారం విచారణకు హాజరు కావాల్సి ఉంది.