స్పీకర్గా ఫిట్ కాననే, ఫ్యాక్షనిస్ట్ను కాను: రోజా సస్పెన్సన్పై కోడెల ఏమన్నారు?
అమరావతి: సభా గౌరవం కోసమే రోజాను సస్పెండే చేశామని, రోజా భాష, హావభావాలు బాగుండలేదని, కోర్టు కూడా రోజాను తప్ప పట్టిందని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ క్షమాపణలు కోరాలని కోర్టు చెప్పినా రోజా వినలేదని, ఆమె నుంచి క్షమాపణలు కోరే లేఖ ఏదీ తమకు అందలేదని ఆయన పేర్కొన్నారు.
సస్పెన్షన్ వ్యవహారంలో రోజా తప్పుదిద్దుకునే అవకాశాన్ని రోజా కోల్పోయారని, అనర్హతపై వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులు సరిగా లేవని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందనుకున్నానని, కానీ, స్పీకర్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.
స్పీకర్ పదవికి తాను సరిపోనని సందేహం ఉండేదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గతంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా మైక్ తీసుకుని స్టేజ్ పై మాట్లాడాలంటే తనకు భయంగా ఉండేదని అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును అడిగానని, అదేసమయంలో, అలా వీలు కానిపక్షంలో ఆ పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదని కూడా చెప్పానన్నారు.
చివరకు చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి స్పీకర్ పదవి ఇవ్వాలని అనుకున్నానని నాతో చెప్పారని అందుకే ఆ పదవినే స్వీకరించానని అప్పటి విషయాలను కోడెల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎప్పుడైతే స్పీకర్ను అయ్యానో తన భావోద్వేగాలను చంపేశానని, తానేమీ టీడీపీ ఏజెంట్ గా వ్యవహరించడం లేదని ఆయన చెప్పారు.
మన దేశంలో ఆరోపణలు లేని స్పీకరే లేరని, అసెంబ్లీలో ప్రతిపక్షానికే ఎక్కువ అవకాశం ఇస్తున్నానని చెప్పుకొచ్చిన ఆయన స్పీకర్ పదవిని దుర్వినియోగం చేయడం లేదన్నారు. ఇక గత రాజకీయాలకు భిన్నంగా ప్రస్తుత రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు.
ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు వచ్చాయని అన్నారు. మన దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా ఈ తరహా రాజకీయాలే కనిపిస్తున్నాయని అన్నారు. పార్టీ ఫిరాయించడమనేది వ్యక్తిగతంగా తనకు నచ్చదని, అయితే, జరుగుతున్న విషయాలను గమనిస్తున్నానని, స్పీకర్గా ఏది చేయాలో అది చేస్తానని పేర్కొన్నారు.
'అన్న ఎన్టీఆర్ పిలిచి సీటు ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగింది. 1983లో రూ.30 వేలు ఖర్చు పెట్టి గెలిచా. మొన్న ఎలక్షన్లలో రూ.11 కోట్లు ఖర్చు పెట్టాను. ఎన్నికల ఖర్చు కోసం కొందరు అవినీతికి పాల్పడుతున్నారు.' అని అన్నారు.
ఇక 'నేను ఫ్యాక్షనిస్టును కాదు. ఫ్యాక్షన్ బాధితుడిని. నాపై నాలుగుసార్లు బాంబు దాడులు జరిగాయి. ఫ్యాక్షనిస్ట్ అనిపించుకుంటే ఎవరూ దగ్గరకు రారని ఒక పెద్దాయన నాకు సలహా ఇచ్చారు' అని కోడెల పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలు అభిమానంతో తనను 'పల్నాటిపులి' అని అంటూ ఉంటారని ఆయన చెప్పారు.