'జగన్, కేఏ పాల్.. ప్రతి వ్యక్తీ సీఎం కావాలనుకంటున్నారు, వైసీపీ చీఫ్ను ఎలా చేస్తారు'
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద రావు శనివారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఇవే చివరి సమావేశాలు అన్నారు. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో అసెంబ్లీకు సెలవులు అని, 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు బడ్జెట్ పైన చర్చ ఉంటుందని తెలిపారు.
అన్ని రంగాల్లోనూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుదామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలతో పాటు పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
ఏపీలో 'సర్వేల' ఫైట్: ట్యాబ్లలో ఎందుకు... జగన్ పార్టీ ఓట్లు లేకుండా చేసే ప్రయత్నమా?
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామన్నారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహాత్మగాంధీ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన కేసులు
కోడెల శివప్రసాద రావు మరో సందర్భంలో తన పైన కేసులు, ముఖ్యమంత్రి పదవిపై పలువురి ఆసక్తి గురించి స్పందించారు. తనపై కేసులున్న మాట వాస్తవమేనని, అవన్నీ రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన కేసులేనని చెప్పారు. తన ఇంట్లో బాంబులు పేలిన మాట వాస్తవమేనని, కానీ వాటిని ఎవరో కావాలని పెట్టారన్నారు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి రావడంపై స్పందిస్తూ.. ఎవరు ఏ పార్టీలోకి అయినా వెళ్లవచ్చన్నారు.
అంపైర్ స్థానంలో కూర్చున్నందుకు బాధ లేదు
బ్యాట్స్మెన్ అయిన తనను అంపైర్ స్థానంలో కూర్చోబెట్టినందుకు ఏనాడూ బాధపడలేన్నారు. తాను ఫ్యాక్షనిస్ట్ని అయితే తన మీదే నాలుగుసార్లు హత్యాయత్నం ఎందుకు జరుగుతుందన్నారు. తనను ఫ్యాక్షనిస్ట్ అనడం బాధ కలిగించిందన్నారు. తాను ఎప్పటికీ పల్నాటి పులినేనని అన్నారు.
అందరూ సీఎం కావాలనుకుంటున్నారు
ప్రతివాడు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారని, ఆఖరుకు కేఏ పాల్ కూడా తానే సీఎంను అంటున్నాడని కోడెల ఎద్దేవా చేశారు. నేర చరిత్ర ఉన్న జగన్ను ప్రజలు ఎలా సీఎం చేస్తారన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. వైసీపీ నేతలు... తన కొడుకు మీద చేస్తున్న ఆరోపణలను నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఆంధ్రా నయీం అంటూ తన కొడుకుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకుతో పోటీ చేయిస్తానని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటానన్నారు. అసెంబ్లీకి రావాలని వైసీపీ నేతలకు ఫోన్ చేసి చెబుతున్నానని, జగన్తో కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. తమకు సభకు రావాలని ఉందని పలువురు ఎమ్మెల్యేలు చెప్పారని అన్నారు.