కోడెలను రాక్షస ప్రభుత్వమే చంపింది.. 18 కేసులు పెట్టి వేధించిందన్న చంద్రబాబు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏపీలోని రాక్షస ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫర్నీచర్ పేరుతో కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఒకటి కాదు రెండు కాదు 18 కేసులు పెట్టి కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేశారని ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం అసత్యాలు వల్లెవేస్తుందని విమర్శించారు.
తప్పు చేసింది మీరే ..
తప్పుడు ప్రచారాలు చేసి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి పెట్టి మరీ వేధించారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ప్రెషర్ చేస్తే మంత్రులు పర్యవేక్షించేవారని ... రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలను ఎత్తితే చాలు ప్రతిపక్షాల నోరుమూయాలని చూస్తున్నారని విమర్శించారు.
కేస్ స్టడీ
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య దేశంలోనే ఓ కేస్ స్టడీ అన్నారు చంద్రబాబు నాయుడు. తప్పుచేయని వ్యక్తిని వేధించారని .. గవర్నమెంట్ ఇచ్చిన ఫర్నీచర్ తిరిగి ఇస్తానని చెప్పిన వినిపించుకోలేదన్నారు. కేసులు పెట్టి మానసికంగా శారీరంగా వేధించి ఆత్మహత్య చేసుకునేవరకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేశారని మండిపడ్డారు. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు తలొగ్గారని చెప్పారు.
నాన్ బెయిలబుల్
విజయసాయిరెడ్డి లాంటి కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకునేందుకు సాయం తీసుకున్నారని తెలిపారు. కోడెల విషయంలో స్టేషన్ బెయిల్ ఉన్నా .. దానిని నాన్ బెయిలబుల్ లాగా బిల్డప్ ఇచ్చారని గుర్తుచేశారు. జగన్ తన 4 నెలల పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని .. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు చంద్రబాబు. ఒక్క కోడెలపై 18 కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
గవర్నర్కు ఫిర్యాదు
జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య గురించి గవర్నర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించామని పేర్కొన్నారు. మచ్చలేని నాయకుడు జగన్ ప్రభుత్వ వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డారని గుర్తుచేశారు చంద్రబాబు.