అలా అన్లేదు, కానీ: ఖర్చుపై వైసిపికి దొరికిన కోడెల! రాజీనామా చెయ్: అంబటి
విజయవాడ: గత ఎన్నికల్లో తాను రూ.11.50 కోట్లు చేసినట్లుగా చెప్పినట్లు వార్తలు వచ్చాయని, అవి అవాస్తవమని స్పీకర్ కోడెల శివప్రసాద రావు మంగళవారం నాడు అన్నారు. ఆయన గుంటూరులో ఈ రోజు మాట్లాడారు.
మొన్నటి ఎన్నికల్లో తాను పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని కోడెల చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల పైన ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
తాను అత్యంత విలువలు కలిగిన వ్యక్తినని చెప్పుకున్నారు. తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనిమిదిసార్లు పోటీ చేశానని, ఎప్పుడు కూడా నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పారు. తాను ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎలక్షన్ కమిషన్కు జమా ఖర్చుల వివరాలన్నీ సమర్పిస్తానన్నారు.
ఇంత వరకు తను సంపాదించిన మొత్తం తన కష్టార్జితమేనన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో అక్కడ నేతలు, కార్యకర్తలు, ప్రజలు చెప్పిన మాటలే తాను చెప్పానన్నారు. తనకు తెలియకుండా గ్రామల్లో ఖర్చు చేస్తే చేసి ఉండొచ్చని అది తనకు తెలియదన్నారు. ఎన్నికల వ్యయం పెరిగిపోతోందని అనడం వాస్తవమన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రాబల్యం పెరగడం ప్రమాదకర సంకేతమన్నారు.
కోడెలపై చర్యలు తీసుకోవాలి: అంబటి
కోడెల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసిపి నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. దీని కోసం విచారణ కూడా అవసరం లేదన్నారు. కోడెల పైన నేరుగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్ట సభ్యుడిగా ఉంటూ, స్పీకర్గా కొనసాగే హక్కు ఆయనకు లేదన్నారు.
కోడెల వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకోవాలన్నారు. చట్ట ప్రకారం ఎలా చర్యలు తీసుకోవాలి అనే దాని పైన తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. రూ.11 వందల కోట్లు సంపాదించాలనే ఆలోచనలో కోడెల ఉన్నట్లుగా ఉందని ఆరోపించారు. కోడెల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన తక్షణమే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలన్నారు.