కోడెల వర్ధంతి .. పల్నాటి పులి అన్న చంద్రబాబు.. పొలిటికల్ డాక్టర్ అంటూ లోకేష్ ట్వీట్
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల శివప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 36 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాద్ అని చంద్రబాబు కోడెల శివప్రసాద్ ను కొనియాడారు. రాజకీయ కక్ష సాధింపులతో కోడెల శివప్రసాద్ ను బలి తీసుకున్నారని , ప్రస్తుతం కోడెల ప్రధమ వర్ధంతి కూడా జరుపుకోనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబు
కోడెల డాక్టర్ గా పల్నాటి బిడ్డ .. రాజకీయ నాయకుడిగా పల్నాటి పులి : చంద్రబాబు
ఎవరు ఏమి చేసినా ప్రజల మనసుల్లో కోడెల చిరస్మరణీయంగా ఉంటారని ఆయన జ్ఞాపకాలను ఎవరూ చెరిపి వేయలేరని వ్యాఖ్యానించారు చంద్రబాబు . విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమని కోడెలను కొనియాడారు. డాక్టర్ గా ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని, ఒక డాక్టర్ గా ఆయన పల్నాటి బిడ్డగా గుర్తింపు పొందారన్నారు . రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడిగా పల్నాటి పులి అనిపించుకున్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆయన గొప్పతనం కోటప్ప కొండ ఆలయం చెప్తుందన్న టీడీపీ అధినేత
కోడెల శివప్రసాద్ మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలలోనే తీరనిలోటు అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కోడెల గొప్పతనం గురించి, ఆయన ప్రజా సేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుందని వ్యాఖ్యానించారు చంద్రబాబు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ గా రికార్డు స్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించారని, అది ఆయన పట్టుదలకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. అవయవ దాన కార్యక్రమాన్ని సామూహిక కార్యక్రమం చేసిన ఘనత కోడెల శివప్రసాద్ దే అని స్పష్టం చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.
కోడెల వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ ... పొలిటీషియన్ డాక్టర్ అంటూ
కోడెల శివప్రసాద్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. డాక్టర్ గా పేదలకు సేవ చేయడంతోపాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్స చేసి శాంతిని ,అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటీషియన్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాద్ రావు గారు అంటూ ట్విట్టర్ లో ఆయన గొప్పతనాన్ని తెలియజేశారు లోకేష్.
Recommended Video
కక్షలు , కుట్రలతోనే ఆయన దూరం అయ్యారంటూ ఆవేదన
అవినీతిపరుల కక్షలు, కుట్రలు కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది అంటూ పేర్కొన్న లోకేష్ మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల మంత్రి వర్గంలో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారు అంటూ వ్యాఖ్యానించారు.నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి గా తన వ్యక్తిత్వంతో ఆ పదవికే వన్నె తెచ్చారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హయాం నుండి పార్టీకి విశేష సేవలందించిన, రాజకీయ ప్రస్థానంలో తిరుగులేని నాయకుడిగా వెలిగిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడి నేటికి ఏడాది . ఆయన వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు , ఆయన అభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు .