‘చచ్చిపో’ కోడికత్తి శ్రీనుకు జైల్లో వేధింపులు: చంపేస్తారేమోనంటూ పోలీసులకు ఫిర్యాదు
రాజమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనును జైల్లో వేధిస్తున్నారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతని సోదరుడు జనుపల్లి సుబ్బరాజు ఫిర్యాదు చేశారు.
మానసిక వేధింపులు
సోమవారం సాయంత్రం తన తరపు న్యాయవాది అబ్దుల్ సలీమ్తో కలిసి పోలీస్ ష్టేషన్ కు వచ్చారు సుబ్బరాజు. తన సోదరుడు శ్రీనును జైలు అధికారులు మానసికంగా హింసిస్తున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసు ముఖ్యమంత్రికి సంబంధించినది కావడంతో తన సోదరుడికి జైల్లో భద్రత కల్పించడంతోపాటు, కేసు దర్యాప్తు బాధ్యతలను పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలకు అప్పగించాలని, అప్పుడే దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతుందని వ్యాఖ్యానించారు.
చచ్చిపోతావా.. చంపమంటావా..?
నీవు తొందరగా సచ్చిపో.. ఆత్మహత్య చేసుకో.. లేదంటే మేమే చంపుతామంటూ శ్రీనివాసరావును జైలు అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. జైలర్ తనను హింసిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పాడని ఆయన సోదరుడు సుబ్బరాజు చెప్పారు.
భయంగా ఉందంటూ..
తనకు భయంగా ఉందని తన సోదరుడు చెప్పాడని సుబ్బరాజు తెలిపారు. జైలు అధికారులు తన సోదరుడిని తీవ్రంగా కొడుతున్నారని చెప్పారు. జైల్లో ఉంటే తన సోదరుడికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కాగా, జనుపల్లి సుబ్బరాజు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు.
అనేక అనుమానాలు..
గత ఏడాది అక్టోబర్లో విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు.. సెల్ఫీ దిగాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన జగన్.. అతడ్ని పక్కకు తోసేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో దాడి..
అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ దాడి జరగగా.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవడంతో కేసు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా, శ్రీనివాసరావు సోదరుడి ఫిర్యాదుతో మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది.