మారిన గూడు: జగన్ సాక్షి మీడియాలో ఇక లైవ్ విత్ కెఎస్ఆర్
హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీ అగ్రహానికి గురై ఎన్టీవీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీకి పనిచేయనున్నారు. ఆయన లైవ్ విత్ కెఎస్ఆర్ చర్చా కార్యక్రమం ఈ నెల 13వ తేదీన సాక్షి టీవీలో ప్రసారమవుతున్నట్లు వినికిడి.
ఆయనకు సాక్షి టీవీ చానెల్లో ఏ హోదా ఇచ్చారో తెలియదు గానీ సమకాలీన రాజకీయాలపై ప్రతి రోజూ ఉదయం పూట లైవ్ విత్ కెఎస్ఆర్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాలని యాజమాన్యం అడిగినట్లు సమాచారం. 1978లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిస్టుగా ప్రారంభమైన కొమ్మినేని శ్రీనివాస రావు ఆ తర్వాత వివిధ చానెళ్లలో పనిచేశారు.
గత ఏడేళ్ళుగా ఎన్టీవీ న్యూస్ ఛానల్ లో గౌరవ సంపాదకులుగా, ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ఆ ఛానల్ లో రోజు ఉదయం ఆయన నిర్వహించే లైవ్ విత్ కెసిఆర్ పేరిట రాజకీయ చర్చా వేదిక పాపులర్ అయింది. కానీ అదే కార్యక్రమం కారణంగా అయన ఉద్యోగం కూడా వదులుకోవలసి వచ్చింది. ఆయనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కూడా కలిగించింది.
KSR LIVE SHOW: తప్పు కోవడం వెనుక రాజకీయ నేతల హస్తం?
దాంతో ఆ ఛానల్ యాజమాన్యంపై చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారనే ప్రచారం ఉంది. తన వలన ఛానల్ కి ఇబ్బందులు, నష్టం కలగడం ఇష్టం లేక ఆయన తన ఉద్యోగం వదులుకోవడానికి సిద్దపడ్డారు. కానీ అందుకు యాజమాన్యం చాలా రోజులు అంగీకరించలేదు. దానితో కొన్ని నెలలు ఆయన సెలవుపై వెళ్ళారు. కానీ పరిస్థితిలో మార్పు ఏమీ కనబడలేదు. దాంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన వెబ్ సైట్ కొమ్మినేని ఇన్ఫో ద్వారా తెలియజేశారు.
ఆయన ఏం చెప్పారు...
ఆయన ఇలా రాశారు - "ప్రతి రోజు కె.ఎస్.ఆర్ లైవ్ షోను నిర్వహించడం ద్వారా లక్షలాది మంది ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం వచ్చింది. ఆ షో నుంచి విరమించడానికి కారణాలను ఇంతకుముందే వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభువులలో ప్రజాస్వామ్య స్పూర్తి కొరవడింది. భిన్నాభిప్రాయాలకు అవకాశం లేని విదంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కొంతకాలం వేచి చూడాలని అనుకున్నప్పటికీ జరిగిన కొన్ని పరిణామాలలో ఆత్మగౌరవమే ముఖ్యమని భావించి బయటకు వచ్చేశాను.ఏడేళ్లపాటు ఎన్.టి.విలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు , యాజమాన్యం నన్ను గౌరవంగా చూసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.ఎన్.టి.వి సంస్థ, యాజమాన్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను."