ఎట్టకేలకు చంద్రబాబు కదిలి వచ్చారు: జగన్తో కలిసి ఇలా..: డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వేళ..!
ఏపీ శాసనసభలో కీలక సన్నివేశం. ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేత కలసి నడిచిన వేళ. ఏపీ శానసభా డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్గా సీతారాం ఎన్నిక సమయంలో ప్రొటెం స్పీకర్గా ఏ విధంగా అయితే స్పీకర్ ఎన్నిక ప్రకటించి అన్ని పార్టీల నేతలు ఆయన్ను ఛైర్ వద్దకు తేవాలని చెప్పారో..అదే లైన్ను తిరిగి స్పీకర్ ఈ రోజు సైతం చదివారు. కానీ, ఆ రోజు తనను పిలవకుండా ఎలా వస్తానని ప్రశ్నించిన చంద్రబాబు..ఈ రోజు మాత్రం వెంటనే లేచి కోన రఘుపతి వద్దకు వచ్చారు. సీఎం జగన్తో కలిసి రఘుపతిని ఛైర్ వద్దకు తెచ్చారు. దీంతో..అందరి లోనూ ఇదే అంశం పైన చర్చ మొదలైంది.
చంద్రబాబు కదిలి వచ్చారు..జగన్తో కలిసి
ఏపీ శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రితో పాటుగా అన్ని పార్టీల నేతలు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘుపతిని ఛైర్ వద్దకు తేవాలని సూచించారు. దీంతో..సీఎం జగన్ నేరుగా కోన రఘుపతి వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు సైతం రఘుపతి వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఆ వెంటనే సీఎం జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు తో సహా రెండు పార్టీలకు చెందిన నేతలు డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతిని ఛైర్ లో కూర్చోబెట్టారు. స్పీకర్ ఎన్నిక సమయంలో చెలరేగిన వివాదానికి ముగింపు పలికే విధంగా డిప్యూటీ స్పీకర్ విషయంలో చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించారు. ఛైర్లో కూర్చొన్న డిప్యూటీ స్పీకర్కు అభినందనలు తెలిపారు. సభ మొత్తం ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా గమనించింది.
స్పీకర్ నోట నాటి మాటలే..చంద్రబాబు మాత్రం..
డిప్యూటీ స్పీకర్ ఎంపిక సమయంలోనూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. స్పీకర్గా తమ్మినేని సీతారం ఎన్నిక సమయంలో తనను ఆహ్వానించలేదని..తనను పిలవకుండా ఎలా వస్తానని బాబు ప్రశ్నించారు. అయితే, నాడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించిన అప్పలనాయుడు సైతం తాను అన్ని పార్టీల నేతలను ఆహ్వానించానని చెప్పటంతో..చివరకు తాను రాకపోవటం తప్పే అని చంద్రబాబు అంగీకరించారు. ఇక, ఈ రోజు కూడా స్పీకర్ ఛైర్లో ఉన్న తమ్మినేని సీతారాం సైతం నాడు ప్రొటెం స్పీకర్ సరిగ్గా ఏ విధంగా అయితే స్పీకర్ను సభా నాయకుడు..అన్ని పార్టీల నేతలు కలిసి ఆయన్ను ఛైర్ వద్దకు తేవాలని సూచించారో..సరిగ్గా అదే విధంగా నేడు స్పీకర్ సైతం ఆహ్వానించారు. దీంతో..చంద్రబాబు సైతం కదలి వచ్చారు. దీంతో..ఈ రోజు కూడా చంద్రబాబు కలిసి వస్తారా లేరా అదే ఉత్కంఠకు చంద్రబాబు తెర దించారు.
జగన్తో కలిసి చంద్రబాబు అడుగులు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ శాసనసభలో ఆసక్తి కర దృశ్యం కనిపించింది. నిప్పు - ఉప్పులా ఉండే ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిసి అడుగులు వేసారు. శాననసభా సమావేశాల తొలి రోజునే ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన తరువాత ముఖ్యమంత్రి ఆ వెంటనే ప్రతిపక్ష నేత వద్దకు వెళ్లి కరచాలనం చేయటం సాధారణం. అయితే, జగన్ ఈ సారి ఆ విధంగా చేయలేదు. అదే విధంగా.. స్పీకర్ ఎన్నిక సమయంలోనూ ఇద్దరి మధ్యా సభ వేదికగా వాదోపవాదాలు జరిగాయి. కానీ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో మాత్రం జగన్..చంద్రబాబు ఇద్దరూ కోన రఘుపతిని ఆలింగనం చేసుకొని ఆయన్ను ఛైర్ వద్దకు తీసుకొచ్చారు. ముందుండి జగన్ నడుస్తుండగా..మధ్యలో డిప్యూటీ స్పీకర్..ఆయన వెనుక చంద్రబాబు ఉండి కోన రఘుపతిని ఛైర్లో కూర్చోబెట్టారు.