కారం కొట్టి సాంబశివుడు సోదరుడి హత్య, నయీం పైనే..
నల్గొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు కోనాపురి రాములు హత్యకు గురయ్యారు. నల్లొండ జిల్లా శివారులోని ఓ ఫంక్షన్ హాలులో రాములు హత్యకు గురయ్యారు. కోనాపురి రాములు ఓ ఫంక్షన్ హాలు నుండి బయటకు వస్తుండగా పదిమంది గుంపుగా వచ్చి అతని కళ్లలో కారం కొట్టి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా మారడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. అతని పైన కాల్పులు జరిపిన దండగులు అక్కడి నుండి వెంటనే పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తనకు ప్రాణహానీ ఉందని కోనాపురి రాములు గతంలోనే మొరపెట్టుకున్నారు. అతనికి ఇద్దరు గన్మెన్లను ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోనే దుండగులు అతనిని హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో ఐదు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. బంధువుల పెళ్లికి వచ్చిన రాములుపై వారు దాడికి పాల్పడ్డారు.
తెరాస నేత, మావోయిస్టు మాజీ నేత కోనాపురి రాములును హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. కోనాపురి రాములు హత్యను ఖండిస్తున్నానని తెలిపారు.
నయీం ముఠాపై అనుమానం
కోనాపురి రాములు హత్య వెనుక నయీం ముఠా హస్తముందనే ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను పంపినట్టు చెప్పారు. ప్రజలు సహకరిస్తే వారిని పట్టుకుంటామన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులను అలర్ట్ చేసినట్లు తెలిపారు.