వైఎస్ జగన్కు కేంద్ర ప్రభుత్వం స్వీట్ న్యూస్..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం.. మరో తీపికబురు వినిపించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన దేశ రాజధానిలో కన్నుల పండువగా నిర్వహించనున్న పరేడ్ లో ప్రదర్శించడానికి ఏపీ నుంచి శకటాన్ని ఎంపిక చేసింది. ఏపీతో కలుపుకొని మొత్తంగా 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 23 శకటాలను కేంద్రం ఎంపిక చేసింది.
ప్రభల శకటం..
ఏపీ నుంచి చారిత్రాత్మకమైన కోనసీమ ప్రభల తీర్థం శకటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కోనసీమ ప్రభల తీర్థానికి 400 నుంచి 450 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం కనుమ నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 120 గ్రామాల్లో ప్రభల తీర్థాలను అత్యంత వైభవంగా ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. అంబాజీపేట మండలం మొసళ్లపల్లి జగ్గన్నతోట వద్ద ప్రభల తీర్థం ఊరేగింపు ఆరంభమౌతుంది. కోనసీమ జిల్లాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి.
ఏపీతో పాటు..
ఏపీతో పాటు మరో 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 23 శకటాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వాటన్నింటినీ రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించనుంది. అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లఢక్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వాటిని ఎంపిక చేసింది.
కేంద్రం నుంచి..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి రెండు శకటాలు ఎంపికయ్యాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ శకటాలు పరేడ్ లో పాల్గొంటాయి. వ్యవసాయం, గిరిజన వ్యవహారాలు, సాంస్కృతిక, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శకటాలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శితమౌతాయి. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, డీఆర్డీఓ శకటాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యం దక్కలేదు.
వైసీపీ హర్షం..
కోనసీమ ప్రభల తీర్థాన్ని గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం ఎంపిక చేయడం పట్ల అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు మంత్రులు, కోనసీమ జిల్లాలకు చెందిన వైసీపీ ఎంపీల, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను దేశ ప్రజలందరికీ వివరించడానికి ఇదో చక్కని వేదిక అని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజల ముందు..
రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోనసీమ ప్రభలతీర్థం శకటం ఎంపిక కావడం గర్వకారణమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి అన్నారు. 400 సంవత్సరాల విశిష్ట సంస్కృతి ఇతివృత్తంతో రైతే రాజు అని చాటి చెబుతూ, పాడిపంటలతో ఎడ్లబండిలో ఉన్న రైతన్నతో ప్రభుత్వం ఈ శకటానికి రూపకల్పన చేసిందని వివరించారు. దేశ, విదేశాంగ ప్రతినిధుల ముందు ప్రదర్శించే సదవకాశం లభించిందని పేర్కొన్నారు.