చంద్రబాబుకు వ్యతిరేకంగానా? జగన్ కు మద్దతు గానా? : కొణతాల పయనం ఎటువైపు!
అనకాపల్లి : వైసీపీకి దూరమయ్యాక చాలా కాలంగా క్రియాశీలక రాజీకాయలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ. టీడీపీలో చేరబోతున్నారంటూ.. ఆమధ్య ప్రచారం జరిగినా.. ఆ తర్వాత దాని ఊసే లేదు. ఏ పార్టీలో చేరాలన్న విషయం పక్కనబెడితే.. వ్యక్తిగతంగాను ఇంతవరకు ఆయన ఎటువంటి పొలిటికల్ స్టాండ్ తీసుకోలేదు.
ఈ నేపథ్యంలోనే 'చాయ్ చర్చా' అంటూ ఇప్పుడాయన జనంలోకి వెళ్తుండడంపై ఆసక్తి నెలకొంది. ప్రత్యేక హోదాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను చాయ్ చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నారు కొణతాల. అంతా బాగానే ఉంది గానీ.. ఇప్పుడీ కార్యక్రమం టీడీపీకి వ్యతిరేకంగానా? జగన్ కు మద్దతుకు గానా? అన్నది ఎటూ తేలని అంశం.
ఎందుకంటే.. ప్రత్యేక హోదాపై గళం ఎత్తడమంటే అధికారంలో ఉన్న టీడీపీని, బీజేపీని నిలదీయడమే అవుతుంది. ఆ పని ఇప్పటికే ప్రతిపక్షం తరుపున జగన్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు పవన్ కూడా ప్రత్యేక హోదాపై అనంతపురంలో మరో సభకు సిద్దమైపోయారు. మరిలాంటి సమయంలో.. కొణతాల తన చాయ్ చర్చా ద్వారా ఎవరికీ దగ్గరవ్వాలని నిర్ణయించుకున్నారనేది ఆసక్తిని సంతరించుకున్న అంశం.
కొణతాలను అప్పట్లో టీడీపీలో చేర్చుకోవడానికి సర్వం సిద్దమైనా.. భవిష్యత్తులో సొంత పార్టీ నేతల నుంచే ధిక్కారం ఎదురయ్యే పరిస్థితి ఉండడంతో.. కొణతాల ఎంట్రీకి బ్రేకులు పడ్డట్టుగా తెలుస్తోంది. ఎంపీ సీటుపై అప్పటికే మరో మంత్రికి హామి ఇచ్చి ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని భవిష్యత్తులో కొణతాలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. ఆ ప్రయత్నాలకు అక్కడికే ఫుల్ స్టాప్ పడింది.
దీంతో కొణతాల రాజకీయ ప్రయాణం ఎటువైపు? అన్న మీమాంస ఇంకా కొనసాగుతూ వస్తుంది. ఇలాంటి తరుణంలో చాయ్ చర్చా అంటూ ఆయన ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకోవడం.. భవిష్యత్తులో ఆయన్ను ఏ పార్టీకి దగ్గర చేస్తుందో చూడాలి.