తొందరెందుకు?: రాజకీయ భవితవ్యంపై కొణతాల, ఇదో వ్యూహమే!
విశాఖపట్నం: రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఒరవడిని సొంతం చేసుకున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాజకీయ భవిష్యత్పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీపై ఆరోపణలు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారనేదానిపై రాజకీయాల్లో విస్తృత చర్చ జరిగింది, జరుగుతోంది.
అయితే, ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడప్పుడే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేనట్లు కనిపిస్తోంది. ఇటీవల అనకాపల్లిలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులతో ఆయన సమావేశం నిర్వహించి ఈ మేరకు తన నిర్ణయాన్ని వివరించినట్లు సమాచారం.
కాగా, కొణతాల తిరిగి వైసీపీ గూటికే వెళతారని, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బిజెపి నేతల నుండి ఆహ్వానం ఉన్నందున ఆ పార్టీలో చేరవచ్చునని, సొంతగూడైన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లిపోనున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతోపాటు అధికార తెలుగుదేశం పార్టీలో కొణతాల చేరికకు దాదాపుగా రంగం సిద్ధమైపోయిందని, నేడోరేపో ఇందుకు సంబంధించిన ప్రక్రియ అమలులోకి వస్తుందనే ఊహాగానాలు కూడా గడచిన ఆరునెలల క్రితమే జోరుగా సాగాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండు దఫాలుగా కొణతాల సమావేశం కావడం, జిల్లా వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక అనుచరగణం కలిగిన కొణతాల టిడిపిలో చేరికను వ్యతిరేకిస్తూ ఎవరూ ఎటువంటి ప్రకటనా చేయవద్దని పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ సైతం స్వయంగా జిల్లామంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలకు సంకేతాలివ్వడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అయితే తన సోదరుడు రఘునాథ్ కుమార్తెను స్థానిక ఎమ్మెల్యే కుమారునికి ఇచ్చి గత ఫిబ్రవరిలో వివాహం జరిపిన సందర్భంలో ఈ వేడుకకు విచ్చేసిన చంద్రబాబును అక్కడే ఉన్న మాజీమంత్రి కొణతాల విధిగా కలిసి స్వాగతం పలుకుతారని అందరూ భావించారు. అయితే ఈ వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగానైనా కలిసే ప్రయత్నం చేయలేదు కొణతాల.
ఇదిలావుండగా కొణతాలకు అత్యంత విధేయులుగా మెలిగే ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు రెండేళ్ల క్రితం అధికార టిడిపిలో చేరిపోయారు. కొణతాల నుండి గ్రీన్సిగ్నల్ పొందే సీఎం చంద్రబాబు సమక్షంలో వారు టిడిపి గూటికి చేరిపోయారని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో గడచిన రెండు నెలల కాలంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలంటూ కొణతాల రామకృష్ణ తనదైన పంథాలో ప్రజలతో కలిసి పోరు సాగించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులను పర్యటించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సైతం కొణతాల చేపట్టారు.
కాగా, కొణతాల పర్యటనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నేతలు సైతం యధావిథిగా హాజరై మద్దతు ప్రకటించడం గమనార్హం. వారితోపాటు తటస్థంగా మెలుగుతున్న జిల్లాలోని అన్ని మండలాల్లోని వ్యక్తిగత అభిమానులు, సన్నిహిత నేతలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ కొణతాలకు అండగా నిలిచారు.
ఈ నేపథ్యంలో ఇటీవల అనకాపల్లిలో ఆత్మీయతా సమావేశం పేరిట జరిగిన సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని దాదాపుగా 500మంది ముఖ్యనేతలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిక ఇప్పట్లో ఉండబోదని, రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు మారుతాయో, రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమని పేర్కొన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోవడం వలన రైతాంగానికి ఉపయోగపడే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ ప్రాజెక్టును సాధించేందుకు సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ ఉద్యమాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల పరిధికి విస్తరించనున్నట్లు ఆయన సూచన ప్రాయంగా తెలిపారు.
ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తూ ప్రజలతో మమేకమవ్వాలని కొణతాల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, తనకున్న జన బలాన్ని మరింతగా పెంచుకుని తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.