కొండా సురేఖ తిరకాసు: పరకాల సీటు కోసం పట్టు?
అయితే, పరకాల సీటును సాధించుకోవడానికి కొండా దంపతులు వ్యూహాత్మకంగా కదులుతున్నట్లు తెలుస్తోంది. తాము పార్టీ మారడం లేదని కొండా మురళి స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. తమను అనేక పార్టీలు ఆహ్వానిస్తున్నాయన్నారు. అన్ని ప్రధాన పార్టీల నేతలు తమను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంప్రదించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునన్నారు. అంత మాత్రానికే పార్టీ మారాల్సిన అవసరం లేదని మురళి స్పష్టం చేశారు. కొండా మురళి ప్రకటన వ్యూహాత్మకమేనని అంటున్నారు. తెరాసపై ఒత్తిడి పెంచడానికే ఆ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.
తమ పార్టీలో చేరాలంటూ కొండా దంపతులపై తెరాస నాయకులు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. తెరాస శాసనసభా పక్ష ఉప నేత టి.హరీశ్రావు కొండా మురళితో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. తెరాస మరో ఎమ్మెల్యే కెటి రామారావు ఆయనను స్వయంగా కలిసి మాట్లాడారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ సీటు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును కొండా దంపతులకు ఇవ్వజూపారు. అయితే ఒక్క పరకాల అసెంబ్లీ సీటు తమకిస్తే చాలని, బదులుగా తాము భూపాలపల్లి, వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను నెత్తినెత్తుకుంటామని కొండా దంపతులు చెప్పినట్లు తెలుస్తోంది.
పరకాలలో తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి ఉన్నారు. ఆయనను కాదని సురేఖకు అక్కడి నుంచి పార్టీ టికెట్ ఇవ్వటానికి తెరాస అధిష్ఠానం వెనుకాముందు ఆలోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొండా దంపతులు పార్టీ వీడకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.