కెసిఆర్ వ్యక్తిత్వం బయటపడింది: సురేఖ, జీతాలపై ఎపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తిత్వం ఇప్పుడు బయటపడిందని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ శుక్రవారం అన్నారు. అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడిన అనంతరం ఆమె మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.
కెసిఆర్ చేసేదుంటే చేస్తామని, లేదంటే చేయమని ఖరాఖండిగా చెబుతున్నారని కొనియాడారు. రైతులు, బడుగు బలహీన వర్గాలకుతెరాస పెద్ద పీట వేసిందన్నారు. కెసిఆర్ అసెంబ్లీలో చెప్పిన విషయాలు భవిష్యత్తుకు అద్దం పడతాయన్నారు. తాము ఫీజు రీయింబర్సుమెంట్సు పైన వెనక్కి పోమని చెప్పారు. కాగా, గిరిజన బిడ్డలకు తెరాస ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని రేఖానాయక్ అన్నారు.
కాజీపేట రైల్వే జోన్ పైన కడియం
కాజీపేటను రైల్వే జోన్గా చేసేందుకు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ సమ్మతించారని వరంగల్ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరి వేరుగా అన్నారు. రైతులు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని కెసిఆర్ చెప్పడం హర్షణీయమన్నారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదాపై బడ్జెట్ సమావేశాల్లో పోరాడుతామన్నారు.
ఇబ్బంది లేదు: యనమల
ఈ నెల ఉద్యోగుల జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడారు. రాజమండ్రి ఎయిర్ పోర్టును విస్తరించి కాకినాడు పోర్టుకు అనుసంధానం చేస్తామన్నారు. విశాఖ-కాకినాడ మధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి కృషి చేస్తామన్నారు. శ్రీకాకుళం-నెల్లూరు వరకు ఆరు లేదా 8 లైన్ల రోడ్, 13 జిల్లాల్లో రైల్వే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు.